తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై వైసీపీ నేత, కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై వైసీపీ నేత, కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదోనిలో సోమవారం సాయిప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు రావాలంటే కనీసం రెండు మూడు నెలలు పడుతుందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ చేస్తున్న దీక్షలను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. తాము కూడా వాటిని గుర్తించడం లేదని చెప్పారు.
ఆదోనిలో బూటుకాలితో తన్నే పోలీసు అధికారులు ఎవరూ లేరని.. సానుభూతి కోసమే టీడీపీ నేత భాస్కర్రెడ్డి అలా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. పశువులకు సీఎం, మంత్రుల ఫొటోలు కట్టి అనుమతి లేకుండా ఊరేగిస్తే ప్రభుత్వం ఊరుకుటుందా? అని ప్రశ్నించారు. తాము సైతం పోలీసులు, అధికారుల అనుమతి తీసుకునే ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు.
చంద్రబాబు నాయుడు విడుదల కావాలని టీడీపీ నేతలు నిరసలు చేస్తున్నారని.. గుండు గీయించుకుంటూ, ఉరితాళ్లు మెడకు బిగించుకున్నట్టుగా ఫొటోలకు పోజులు ఇస్తున్నారని.. అదేదో నిజంగా ఉరేసుకుంటే సరిపోతుంది కదా అని సాయిప్రసాద్ రెడ్డి అన్నారు.
