తాను అవినీతికి పాల్పడినట్లు తేలితే బుచ్చిరెడ్డిపాలెం నడిరోడ్డులో ఉరేయ్యాలని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సవాల్ విసిరారు. తన గురించి సోమిరెడ్డి, ఆనం రాం నారాయణ రెడ్డిలను అడిగి తెలుసుకోవాలని లోకేష్‌కు చురకలంటించారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కళ్లున్న వారికే అభివృద్ధి కనిపిస్తుందని, బచ్చా లోకేశ్‌కు ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. తాను అవినీతికి పాల్పడినట్లు తేలితే బుచ్చిరెడ్డిపాలెం నడిరోడ్డులో ఉరేయ్యాలని నల్లపురెడ్డి సవాల్ విసిరారు. లోకేష్ చేసిన అవినీతి ఆరోపణలపై జగన్‌ను కలిసి సీబీఐని విచారణ వేయాల్సిందిగా కోరతానని ఎమ్మెల్యే చెప్పారు. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని నల్లపురెడ్డి డిమాండ్ చేశారు. 

తన వద్ద రూ.1500 కోట్లు వుంటే నెల్లూరు జిల్లాలో టీడీపీనే లేకుండా చేస్తానని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ కుటుంబానికి 16 వేల ఎకరాల భూమి వుంటే పేదలకు పంచిపెట్టామని ప్రసన్నకుమార్ రెడ్డి గుర్తుచేశారు. టీడీపీ నేతలను తన ఇంటికి పంపితే ఆస్తి వివరాలు ఇస్తానని ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబుకు ఆయన తండ్రి రెండెకరాల పొలం ఇస్తే.. ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని నల్లపురెడ్డి ప్రశ్నించారు. తన గురించి సోమిరెడ్డి, ఆనం రాం నారాయణ రెడ్డిలను అడిగి తెలుసుకోవాలని లోకేష్‌కు చురకలంటించారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరించారు. 

అంతకుముందు వైసిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసారు. కేవలం ఆరోపణలే కాకుండా మాజీ మంత్రి భూఅక్రమాలు, బినామీల పేరుతో పెట్టిన అక్రమాస్తుల చిట్టా ఇదేనంటూ ఆధారాలను బయటపెట్టారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అనిల్ వెయ్యి కోట్లకు పైనే సంపాదించారని లోకేష్ ఆరోపించారు. 

ALso Read: అనిల్ యాదవ్ అక్రమాస్తుల చిట్టా ఇదే..: ఆధారాలతో సహా బైటపెట్టిన లోకేష్

నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కు దొంతాలి వద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేర్ల మీద రూ.10 కోట్ల విలువచేసే 50 ఎకరాల భూమి వుందని లోకేష్ తెలిపారు. అలాగే నాయుడుపేటలో రూ.100 కోట్ల విలువైన మరో 58 ఎకరాలు కూడా బినామీ పేర్లతో వున్నాయన్నారు. ఇక ఇనుమడుగు సెంటర్ లో బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో రూ.10 కోట్ల విలువైన 400 అంకణాలు స్థలం వుందని లోకేష్ వెల్లడించారు. 

ఇస్కాన్ సిటీ లో బినామీల పేర్లతో రూ.33 కోట్ల విలువైన 87 ఎకరాల భూమి అనిల్ కు వుందని లోకేష్ తెలిపారు. అల్లీపురంలో అనిల్ తమ్ముడు అశ్విన్ పేరిట రూ.105 కోట్ల విలువైన 42 ఎకరాలు వుందన్నారు. ఇందులో 7ఎకరాలు ఇరిగేషన్ శాఖకు చెందిన భూమి కూడా వుందని...  దాన్ని అనిల్ కబ్జా చేసి తన భూమిలో కలిపేసుకున్నాడని లోకేష్ ఆరోపించారు. సాదరపాళెంలో అశ్విన్ పేరిట రూ.48 కోట్ల విలువగల మరో 12 ఎకరాలు వుందన్నారు. 

ఇక మంత్రి అనిల్ బినామీ చిరంజీవికి ఓ పెద్ద కాంట్రాక్టర్ నుండి దశల వారీగా కోట్ల రూపాయలు అందాయని లోకేష్ ఆరోపించారు. బృందావనంలో శెట్టి సురేష్ అనే బినామీ రూ.25 కోట్ల విలువైన 4 ఎకరాలు భూమి అనిల్ కు వుందన్నారు. దామరమడుగులో బావమరిది పేరుతో రూ.4కోట్ల విలువైన 5 ఎకరాలు వుందన్నారు. గూడూరు-చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు లేపేసిన అనిల్ 40 ఎకరాల్లో లే అవుట్ వేసారని లోకేష్ ఆరోపించారు.