చంద్రబాబు అంటే నాకెంతో గౌరవం... టిడిపి ఎంపీతో కలిసి పనిచేస్తా..: వైసిపి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
వైసిపి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు టిడిపి చీఫ్ చంద్రబాబు, ఎంపీ కేశినేని నాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
నందిగామ : అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి లు రాజకీయంగా బద్దశత్రువులు. ఆ పార్టీ నాయకుల మధ్య నిత్యం మాటలయుద్దం కొనసాగుతూ వుంటుంది. అప్పుడుప్పుడు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటాయి. అలాంటిది ఇరుపార్టీలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం రాజకీయ చర్చకు దారితీసింది. ఇటీవల టిడిపి ఎంపీ కేశినేని నాని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావును ప్రశంసించిన విషయం తెలిసిందే. తాజాగా వైసిపి ఎమ్మెల్యే కూడా ప్రత్యర్థి పార్టీ ఎంపీ నానిపై ప్రశంసలు కురిపించారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని మంచిని మంచి అని చెప్పడం కొందరి కడుపుమంటకు కారణమయ్యిందని నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు అన్నారు. నందిగామ ప్రజలు ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా నానిని గెలిపించారు... కాబట్టి రాజకీయాలను పక్కనబెట్టి ప్రజాసేవ చేస్తున్నామని అన్నారు. నందిగామ నియోజకవర్గ అభివృద్ది కోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తానని... అదే తనకు ముఖ్యమని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు స్ఫష్టం చేసారు.
కేవలం ఒకరినొకరు విమర్శించుకోవడమే రాజకీయం కాదని... ప్రజలకు మంచి పాలన అందించడమే రాజకీయ నాయకుడి ప్రథమ కర్తవ్యమని జగన్మోహన్ రావు పేర్కొన్నారు. ఎంతో నమ్మకంతో ప్రజలు తమను గెలింపించారు... కాబట్టి నందిగామను అభివృద్ధి చేయటం ఇద్దరి బాధ్యత అన్నారు. ఇప్పటివరకు చేసిన అభివృద్ది ఏమిటో ప్రజలకు తెలుసని... అది వారు మర్చిపోరని అన్నారు.ప్రజలకు సేవ చేస్తేనే ఎంతటి గొప్ప నాయకులైన తిరిగి గెలుస్తారని... లేదంటే ఓటమి తప్పదని వైసిపి ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Read More బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయను.. వాళ్లు మంచి పని చేస్తున్నారనే మాట్లాడాను: కేశినేని కీలక వ్యాఖ్యలు
నందిగామ నియోజకవర్గ అభివృద్ది కోసం తాను ఎవరితోనైనా కలిసి వెళ్లతానని జగన్మోహన్ రావు అన్నారు. పని చేయడానికే ప్రజలు తనకు అవకాశం ఇచ్చారు కాబట్టి వారి నమ్మకాన్ని వమ్ముచేయనని అన్నారు. తన గురించి చేసే పనికిమాలిన విమర్శలను పట్టించుకోనని ఎమ్మెల్యే అన్నారు.
పార్టీల మధ్య విధానాలపై విమర్శలు వుండాలే తప్ప వ్యక్తిగత విమర్శలు వుండకూడని వైసిపి ఎమ్మెల్యే అన్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులనూ తాను గౌరవిస్తానని... అందరినీ పలకరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎదురుపడిన సమయంలో నమస్కారం పెడతానని... అది ఆయనను గౌరవించడం మాత్రమేనని అన్నారు. పార్టీలుగా ఎన్ని విమర్శలు చేసుకున్నా వ్యక్తులుగా పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని జగన్మోహన్ రావు అన్నారు.
నందిగామ నియోజకవర్గంలో ప్రోటోకాల్ ప్రకారం పనిచేయాలని... పార్టీలకు అతీతంగా అందరిని ఆహ్వానించాలని అధికారులకు చెబుతుంటానని ఎమ్మెల్యే అన్నారు. ఎంపీగా కేశినేని నాని నియోజకవర్గంలో టాటా ట్రస్ట్ సేవలు అందించారని అన్నారు. కంచికచర్ల, నందిగామ బైపాస్ రోడ్ల నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. ఆయన చేసిన మంచిని మంచి అనే చెబుతామని... అభివృద్ ధినిధుల కోసం ఖచ్చితంగా కేశినేని నానితో మళ్ళీ మాట్లాడతానని మొండితోక జగన్ మోహన్ రావు స్ఫష్టం చేసారు.