చీరేస్తానంటూ ఎంపీడీవోకు వైసీపీ నేత వార్నింగ్.. క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే
అయినవిల్లి ఎంపీడీవో విజయకు (mpdo vijaya) తాను బహిరంగంగా క్షమాపణ చెప్పారు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు (kondeti chittibabu). ఎంపీడీవో విజయపై వైసీపీ నేత తాతాజీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
అయినవిల్లి ఎంపీడీవో విజయకు (mpdo vijaya) తాను బహిరంగంగా క్షమాపణ చెప్పారు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు (kondeti chittibabu). ఎంపీడీవో విజయపై వైసీపీ నేత తాతాజీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఏడాది నుంచి తాతాజీ పార్టీకి దూరంగా ఉంటున్నారని.. ఆయనతో వైసీపీకి సంబంధం లేదని ఎమ్మెల్యే తెలిపారు. మహిళా ఎంపీడీవోపై తాతాజీ దుర్భాషలాడినందుకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే చిట్టిబాబు పేర్కొన్నారు.
ఎంపీడీఓపై అధికార పార్టీ నేత ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చాంబర్లోనే దళిత ఎంపీడీఓపై వైసీపీ నేత వాసంశెట్టి తాతాజీ ఏకవచనంతో రెచ్చిపోయారు. ఎంపీడీఓ నచ్చకపోతే పంపించేయండని అంటే సరిగ్గా చేయకపోతే చీరేస్తానని వైసీపీ నేత బెదిరించారు. ఈ నేపథ్యంలో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ వైసీపీలోని ఒక వర్గం టార్గెట్ చేస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీడీఓ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో కొంతమంది వైసీపీ నేతల మాట ఆమె దగ్గర చెల్లకపోవడంతో కొన్ని నెలలుగా ఎంపీడీఓపై నేతలు కక్ష్యగట్టి ఆరోపణలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు ఎంపీడీవో విజయను బెదిరించిన వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినవిల్లి మండల జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, ఎన్.పెదపాలెం మాజీ సర్పంచ్ నేదునూరు తాతాజీ, క్రాప శంఖరాయగూడెం మాజీ సర్పంచ్ కుడుపూడి రామకృష్ణ, కె.జగన్నాధపురం గ్రామానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాసరావులపై కేసు నమోదు చేశారు.