నాలుగు నెలల్లో మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా .. ఇక ఏరివేతే : కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తాడిపత్రి ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల తర్వాత తన అసలు రూపం చూపిస్తానని, ఎన్నికల తర్వాత మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారని .. ఫ్యాక్షన్ మొదలు పెడతానని ఆయన తెలిపారు.
తాడిపత్రి ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల తర్వాత తన అసలు రూపం చూపిస్తానని, ఎన్నికల తర్వాత మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారని .. ఫ్యాక్షన్ మొదలు పెడతానని ఆయన తెలిపారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తన ప్రత్యర్ధులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులు తాను దోచేస్తున్నానంటూ తనపై కరపత్రాలు వేసి అసత్య ప్రచారం చేస్తున్నారని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఉనికి కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని, రాబోయే రోజుల్లో తాడిపత్రిలో చీడ పురుగులను ఏరేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.
మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. బీనామీ పేర్లతో తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ఆస్తులను కొల్లగొట్టారని.. ఇకపై ప్రభాకర్ రెడ్డి కానీ, ఆయన అనుచరులు కానీ నోరు జారితే ఊరుకునేది లేదన్నారు. జేసీ వర్గీయులు తన ఓర్పును పరీక్షించవద్దని, తాడిపత్రిలో గొడవలు సృష్టించి సానుభూతి పొందేందుకు కుట్రలు చేస్తున్నారని, అందుకు తప్పుడు విధానాలను అవలంభిస్తున్నారని కేతిరెడ్డి ఫైర్ అయ్యారు.