యనమలకు కళ్లు పోయాయా లేక బడ్జెట్ చూసి మైండ్ బ్లాక్ అయిందా: జోగి రమేష్ ఫైర్
యనమలకు ఏమైనా కళ్లు పోయాయా అంటూ ప్రశ్నించారు. జగన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తే చంద్రబాబు నాయుడు దాన్ని వెబ్సైట్ నుంచి తొలగించాడని విమర్శించారు. రైతు భరోసా ద్వారా రైతులకు రూ. 8750 కోట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3 వేల కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానికే చెల్లుతుందని జోగి రమేష్ స్పష్టం చేశారు.
విజయవాడ : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రచారం తప్ప పసలేదన్న మాజీ ఆర్థిక మంత్రి యనమల రాజమకృష్ణుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. బడ్జెట్పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి మాటలు వింటే నవ్వొస్తుందని విమర్శించారు.
బడ్జెట్పై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ యనమల రామకృష్ణుడుకు సవాల్ విసిరారు. బడ్జెట్ చూసి యనమలకు మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లోనే అన్ని వర్గాల వారికి పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు.
బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు బడ్జెట్ లో పెద్దపీట వేశామన్నారు. నవరత్నాలను 80 శాతం ప్రజలకు చేర్చేలా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని యనమల వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
యనమలకు ఏమైనా కళ్లు పోయాయా అంటూ ప్రశ్నించారు. జగన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తే చంద్రబాబు నాయుడు దాన్ని వెబ్సైట్ నుంచి తొలగించాడని విమర్శించారు. రైతు భరోసా ద్వారా రైతులకు రూ. 8750 కోట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3 వేల కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానికే చెల్లుతుందని జోగి రమేష్ స్పష్టం చేశారు.
రైతులకు వైఎస్సార్ బీమా, ఆక్వా రైతులకు విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తమది రైతు ప్రభుత్వమని అందుకు ప్రవేశపెట్టిన పథకాలే నిదర్శమన్నారు.
మరోవైపు ప్రభుత్వ పథకాలకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెడితే తప్పేంటని నిలదీశారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా కొన్ని లక్షల మంది తల్లుల కలలను నెరవేరుస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
అలాగే నామినేటెడ్ పోస్టులో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత తమకే దక్కుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎప్పుడైనా రిజర్వేషన్లు పాటించారా అంటూ మండిపడ్డారు. తొందర్లోనే 30 కమిటీలు వేసి టీడీపీ నేతలు తిన్న సొమ్ము కక్కిస్తామని ఎమ్మెల్యే జోగి రమేష్ హెచ్చరించారు.