నన్ను గుర్తుంచుకోండి సార్: జగన్ కు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రిక్వస్ట్
వైసీపీ అధికారంలోకి వస్తే తమకు మంత్రి పదవి వస్తుందని ధీమాతో ఉన్నారట. అటు ప్రజలు, వైసీపీ కార్యకర్తలు సైతం పార్టీలో సీనియర్ నేతలు ఎవరు, జగన్ తో ఉన్న సన్నిహితులను జగన్ కేబినెట్ లో చేర్చేసి ఇదే కేబినెట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసేస్తున్నారు.
కర్నూలు: ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ప్రజా తీర్పు ఇప్పటికే రిజర్వు అయి ఉంది. కానీ ఎవరు అధికారంలోకి రాబోతున్నారన్నది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని వైఎస్ జగన్ సీఎం కాబోతున్నారంటూ ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సర్వేలు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారట.
వైసీపీ అధికారంలోకి వస్తే తమకు మంత్రి పదవి వస్తుందని ధీమాతో ఉన్నారట. అటు ప్రజలు, వైసీపీ కార్యకర్తలు సైతం పార్టీలో సీనియర్ నేతలు ఎవరు, జగన్ తో ఉన్న సన్నిహితులను జగన్ కేబినెట్ లో చేర్చేసి ఇదే కేబినెట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలోకి రాకుండానే నేతలు తనకు మంత్రి పదవి ఖాయమంటూ ప్రచారం చేసుకోవడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ ఉండొచ్చు కానీ మరీ అంత అత్యాస ఉండొద్దని హితవు పలికారు.
ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు కేబినెట్ కూర్పుపై మాట్లాడొద్దని జగన్ సూచించారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ కేబినెట్ లో 26 మందికి స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
పార్టీలోని అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తూ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తాను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలిపారు.
సీనియర్ కోటాలో తనకు మంత్రి పదవి ఖాయమంటున్నారట. ఇప్పటి వరకు చెన్నకేశవరెడ్డి కుటుంబం ఎనిమిది సార్లు ఎన్నికల్లో పోటీ చేయగా మూడు సార్లు చెన్నకేశవరెడ్డి గెలుపొందారు.
మూడుసార్లు ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి మాత్రం చెన్నకేశవరెడ్డి బరిలోకి దిగారు.
ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమాగా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే తానొక సీనియర్ నేతనని తనను గుర్తుంచుకోవాలి సారూ అంటూ జగన్ కు మెురపెట్టుకుంటున్నారట చెన్నకేశవరెడ్డి.