టీడీపీకి  జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా నాయకుడు అవుతాడని  వైసీపీ ఎమ్మెల్యే  చెన్నకేశవరెడ్డి  వ్యాఖ్యానించారు. 

కర్నూల్: ఎప్పటికైనా టీడీపీకి  సినీ నటుడు  జూనియర్ ఎన్టీఆరే  నాయకుడు అవుతాడని  వైసీపికి  చెందిన ఎమ్మిగనూరు  ఎమ్మెల్యే  చెన్నకేశవరెడ్డి  సంచలన వ్యాఖ్యలు  చేశారు. గురువారం నాడు  ఆయన  మీడియాతో  మాట్లాడారు.  చంద్రబాబు తర్వాత   టీడీపీ  ఉండదని  ఆయన  జోస్యం  చెప్పారు.  లోకేష్ ఇంకా  పది యాత్రలు  చేసినా  కూడా నాయకుడు కాలేడని  ఆయన  అభిప్రాయపడ్డారు. . అయితే  అదే సమయంలో  టీడీపీకి  జూనియర్ ఎన్టీఆర్  ఎప్పటికైనా నాయకుడు  అవుతాడన్నారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర  నిర్వహిస్తున్నారు.  సుమారు  4 వేల కిలోమీటర్ల  పాదయాత్ర  చేయాలని లక్ష్యంగా  పెట్టుకున్నారు.   లోకేష్ పాదయాత్ర  కొనసాగుతుంది.   ఈ సమయంలో  చెన్నకేశవరెడ్డి  కామెంట్స్  ప్రస్తుతం   కలకలం  రేపుతున్నాయి.

వచ్చే ఏడాది  ఏపీ అసెంబ్లీకి  ఎన్నికలు  జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  టీడీపీని  ఓడిస్తే   ఇక  ఆ పార్టీ ఉండదని  కూడా  వైసీపీ నాయకత్వం  భావిస్తుంది. అందుకే  175 అసెంబ్లీ  స్థానాల్లో విజయం లక్ష్యంగా  ఆ పార్టీ  ముందుకు వెళ్తుంది.