అన్నీ సమకూర్చుకున్నాకే విశాఖకు జగన్ : వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపడతామన్నారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. విశాఖలో సీఎం కార్యాలయంతో సహా భవనాలన్నీ సిద్ధమయ్యాయని సుబ్బారెడ్డి వెల్లడించారు.

అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపడతామన్నారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. ‘‘విశాఖ వందనం’’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. విశాఖలో సీఎం కార్యాలయంతో సహా భవనాలన్నీ సిద్ధమయ్యాయని సుబ్బారెడ్డి వెల్లడించారు. అన్ని సమకూర్చుకున్న తర్వాతే ముహూర్తం ఖరారైందని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు వీఎంఆర్డీలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని బిల్డింగ్ల ఎంపిక, సన్నద్ధతపై సీఎస్ చర్చించారు. విశాఖలో రాజధాని ఏర్పాట్లపై అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం విశాఖలో జరిగే మౌలిక సదుపాయాలు, అభివృద్ధిని త్వరలో అందరూ చూస్తారని అన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామన్నారు.
విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్ఫా ప్రాజెక్ట్ల అమలు కోసం కొన్ని సూచనలు చేశామని జవహర్ రెడ్డి వెల్లడించారు. నీతి ఆయోగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాలలో విశాఖ ఒకటి కావడం శుభ పరిణామమన్నారు. 2047 వికసిత్ భారత్ కోసం ఎంపిక చేసిన నాలుగు నగరాలలో విశాఖ ఒకటని జవహర్ రెడ్డి తెలిపారు.