బాబును జనం నమ్మలేదు.. కుప్పంలోనే టీడీపీ బొల్తా పడింది: పరిషత్ ఫలితాలపై సజ్జల వ్యాఖ్యలు
ఎల్లోమీడియా, ప్రతిపక్షనేతల ఆరోపణలను ప్రజలు తిప్పికొట్టారని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చివరికి కుప్పం ఓటర్లు కూడా చంద్రబాబును విశ్వసించలేదని సజ్జల దుయ్యబట్టారు. చంద్రబాబు ఎన్ని అడ్డగోలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదని.. తాము సాధించిన ఫలితాలు భారతదేశ చరిత్రలో రికార్డుగా చెప్పవచ్చన్నారు.
పరిషత్ ఎన్నికల ఫలితాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 98 శాతానికి పైగా స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందిందని సజ్జల చెప్పారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు ఈ ఫలితాలే నిదర్శనమని రామకృష్ణారెడ్డి తెలిపారు. జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి 69.55 శాతం ఓట్లు వచ్చాయని ఆయన వెల్లడించారు.
ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి 64.8 శాతం ఓట్లు వచ్చాయని సజ్జల చెప్పారు. ఎల్లోమీడియా, ప్రతిపక్షనేతల ఆరోపణలను ప్రజలు తిప్పికొట్టారని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చివరికి కుప్పం ఓటర్లు కూడా చంద్రబాబును విశ్వసించలేదని సజ్జల దుయ్యబట్టారు. చంద్రబాబు ఎన్ని అడ్డగోలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదని.. తాము సాధించిన ఫలితాలు భారతదేశ చరిత్రలో రికార్డుగా చెప్పవచ్చన్నారు. టీడీపీ తప్పుడు విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. పదవుల్లో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత వుంటుందని.. పార్టీతో పాటు నేతలంతా క్రమశిక్షణతో వున్నారని సజ్జల వెల్లడించారు.