నడ్డాతో చంద్రబాబు వంగి.. నంగి నంగి మాట్లాడారు, పురంధేశ్వరి టిడిపి ఏజెంట్: సజ్జల
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తిట్టిన నోటితోనే మళ్లీ బీజేపీని పొగుడుతున్నారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 వరకు చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. రాజకీయాలు ప్రజల కోసం వుండాలని.. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు హడావుడి చేస్తున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు బఫూన్కు ఎక్కువ.. జోకర్కు తక్కువ అంటూ సెటైర్లు వేశారు. తిట్టిన నోటితోనే మళ్లీ బీజేపీని పొగుడుతున్నారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
నడ్డాతో చంద్రబాబు వంగి వంగి.. నంగి నంగి మాట్లాడారని సజ్జల చురకలంటించారు. చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. 175 నియోజకవర్గాల్లో ప్రజలకు ఏం చేస్తారో చంద్రబాబు చెప్పాలని.. బీజేపీతో పొత్తు కోసం ఆయన తహతహలాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. లోకేష్ పాదయాత్రకు టీడీపీ కార్యకర్తలే రావడం లేదని.. జగన్ ప్రభుత్వంపై 70 శాతం మంది ప్రజలు పాజిటివ్గా వున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. అసలు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలో చంద్రబాబుకు క్లారిటీ లేదని.. 175 నియోజకవర్గాల్లో పోటీ పెట్టేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరన్నారు .
ప్రజలను భ్రమల్లో పెట్టాలనుకునేవాళ్లు.. భ్రమల్లోనే వుంటారని సజ్జల వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారని.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని అవమానించారని రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు . అవసరం వున్నప్పుడల్లా ఇప్పటికీ ఎన్టీఆర్ను చంద్రబాబు వాడుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్లా మారారని.. బీజేపీతో కలిసేందుకు పురందేశ్వరి, పవన్తో పైరవీలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.