నేను ఏ పార్టీలో బలి పశువునయ్యానో అందరికీ తెలుసు : టీడీపీకి దేవినేని అవినాష్ కౌంటర్
టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. తాను ఏ పార్టీలో వున్నప్పుడు బలి పశువును అయ్యానో అందరికీ తెలుసునని అవినాష్ దుయ్యబట్టారు. విజయవాడ ప్రజలకు, దుర్గమ్మకు క్షమాపణలు చెప్పిన తర్వాతే నారా లోకేష్ నగరంలో అడుగుపెట్టాలని హెచ్చరించారు.
టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలో వున్నప్పుడు బలి పశువును అయ్యానో అందరికీ తెలుసునని అవినాష్ దుయ్యబట్టారు. టీడీపీ నేతల పిచ్చివాగుడును ప్రజలు నమ్మరని.. పనికిరాని వారు తమపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారని పేర్కొన్నారు. విజయవాడ ప్రజలకు, దుర్గమ్మకు క్షమాపణలు చెప్పిన తర్వాతే నారా లోకేష్ నగరంలో అడుగుపెట్టాలని హెచ్చరించారు. దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించారని.. టీడీపీ హయాంలో రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టలేదో సమాధానం చెప్పాలని అవినాష్ డిమాండ్ చేశారు. లోకేష్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ కావడంతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని.. ఖర్చు భరించలేక, జనాన్ని సమీకరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని దేవినేని అవినాష్ చురకలంటించారు.
బుద్ధా వెంకన్న కాల్ మనీ నేరస్తుడని.. నెత్తిమీద పైసా ఖర్చు పెట్టినా ఎవరూ కొనరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ మా ఇంటికొచ్చి మంచి మాటలు చెబితే టీడీపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ల వద్ద లోకేష్ సెల్ఫీ దిగాలంటూ అవినాష్ సవాల్ విసిరారు.