పార్టీ పటిష్టతపై వైసీపీ అధిష్టానం ఫోకస్.. కీలక నేతలతో సజ్జల టెలీకాన్ఫరెన్స్, గృహ సారథుల నియామకంపై సమీక్ష
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారాన్ని అందుకోవాలని చూస్తున్న వైసీపీ .. పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టింది. దీనిపై కీలక నేతలతో ఈరోజు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పటిష్టతపై వైసీపీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, పరిశీలకులు, ముఖ్యనేతలతో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ సారథుల నియామక ప్రక్రియపై సజ్జల సమీక్ష చేశారు. గృహ సారథుల ఎంపిక గడువు ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు సజ్జల తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు గృహ సారథులతో మండల స్థాయి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ల అధ్యక్షతన మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులను నియమించనున్నారు. మరింత త్వరగా ప్రజా సమస్యల పరిష్కారానికి గృహ సారథుల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు సజ్జల వెల్లడించారు.
ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పవన్, చంద్రబాబు కలయికకు అటెన్షన్ను క్రియేట్ చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అక్రమం సక్రమని.. వారిది పవిత్ర కలయిక చెప్పడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కారణంగా 11 మంది చనిపోయారని.. చంపినవాళ్ల దగ్గరికి వెళ్లి పరామర్శించడం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ముందు చనిపోయిన వాళ్లను పరామర్శించాలని అన్నారు.
ALso REad: ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు , ఎమ్మెల్యే బాధ్యత అబ్జర్వర్లదే : పార్టీ నేతలతో జగన్
టీడీపీ, జనసేన కలయికను వామపక్షాలు స్వాగతించడం విచిత్రంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ, జనసేన కలిసి బీజేపీని కలుపుకుంటారని అంటున్నారని.. అలాగైతే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఏం మాట్లాడతాయని ప్రశ్నించారు. ఎరుపు, కాషాయం కలిసి పసుపుగా మారుతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఎంత మందిని కలుపుకున్నా.. ఒక విధంగా మంచిదేనని అన్నారు. ఎవరూ ఏ విలువల మీద ఉంటున్నారో తెలుందని చెప్పుకొచ్చారు. గుంటనక్కలు, పందికొక్కులు, ఎలుకలు అన్నీ ఏకమై కలిసివచ్చిన సరే.. ప్రజాబలం ఉన్న జగన్ విజయాన్ని ఆపలేరని అన్నారు. అందరినీ ఒకేసారి ఓడించే అవకాశం సీఎం జగన్కు వస్తుందన్నారు.