పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శారదా చిట్ఫండ్ కుంభకోణంలో సీబీఐ విచారణ జరిపించిందని, అగ్రిగోల్డ్పై ఎందుకు విచారణ చేయించలేదో చెప్పాలని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
అమరావతి: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శారదా చిట్ఫండ్ కుంభకోణంలో సీబీఐ విచారణ జరిపించిందని, అగ్రిగోల్డ్పై ఎందుకు విచారణ చేయించలేదో చెప్పాలని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
అగ్రిగోల్డ్ కుంభకోణం శారద స్కాం కంటే రెండింతలు పెద్దదని చెప్పారు.వైఎస్సార్సీపీ కీలక సమావేశాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆత్మహత్యలు చేసుకొంటూంటే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
కేంద్ర సంస్థతో విచారణ జరిపిస్తే ప్రజలకు న్యాయం జరగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్కాంలో పెద్దల జోక్యం లేకపోతే విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని వైవీ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు రూ.1182 కోట్లు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుంభకోణంలో ఉన్న పాత్రధారులపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు.
ఇంతవరకూ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన జాబితాను ఎందుకు బయటపెట్టలేదని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయడానికి కుట్ర జరుగుతుందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. బాధితులకు బాసటగా ఈనెల 22, 23 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు.
