Asianet News TeluguAsianet News Telugu

వివేకా హత్య కేసు.. మరోమారు సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

YS viveka murder case MP Avinash Reddy Once again Appear Before CBI ksm
Author
First Published Jun 10, 2023, 11:40 AM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించిన సంగత తెలిసిందే. అయితే ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు.. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని షరతు  విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత శనివారం కూడా అవినాష్ సీబీఐ విచారణకు హాజరుకాగా.. నేడు మరోమారు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. 

ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఎంపీని సీబీఐ విచారించనుంది. వివేకా హత్య జరిగిన  రోజు జరిగిన ఫోన్ సంభాషణలపై అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇక,ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని సీబీఐ ఇటీవల ఏ8గా పేర్కొన్న సంగతి తెలిసిందే. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దని కౌంటర్‌ దాఖలు చేసిన సమయంలో.. ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఏ8 అని సీబీఐ పేర్కొంది. 

వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్‌, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ ఈ కౌంటర్‌లో తెలిపింది. వివేకా హత్య, ధ్వంసం వెనక భారీ కుట్రపై దర్యాప్తు సాగుతుందని పేర్కొంది. అవినాష్‌, భాస్కర్‌రెడ్డి‌లు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని తెలిపింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని  ప్రలోభపెట్టినట్టుగా కూడా పేర్కొంది. 

వివేకానందరెడ్డి హత్య విషయం ఆయన పీఏ కృష్ణారెడ్డి చెప్పకముందే అవినాష్ రెడ్డికి తెలుసునని సీబీఐ పేర్కొంది. . వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ఉదయం 6.15కి ముందే తెలుసని సీబీఐ తెలిపింది. శివశంకర్‌రెడ్డి ఫోన్‌ చేసిన నిమిషంలోనే అవినాష్‌రెడ్డి హత్యాస్థలికి చేరుకున్నారని తెలిపింది. హత్య జరిగిన రోజు ఉదయం 5.20కి ముందే అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని పేర్కొంది. దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారని తెలిపింది.  కడప, పులివెందుల ప్రాంతాల్లో భాస్కర్‌రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని పేర్కొంది. భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమేనని తెలిపింది. దర్యాప్తునకు సహకరించానని భాస్కర్‌రెడ్డి చెప్పడం అబద్ధమని పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios