జగన్ 'కాపు' వ్యూహం: పవన్ కల్యాణ్ టార్గెట్
వలసలను ప్రోత్సహించే విషయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు
వలసలను ప్రోత్సహించే విషయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. సామాజిక వర్గాలవారీగా ఓటు బ్యాంకులను కొల్లగొట్టే వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.
గత ఎన్నికల్లో వైసిపి కేవలం 2 శాతం ఓట్ల తేడాతోనే అధికారానికి దూరమైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడంతో కాపు సామాజిక వర్గం ఓట్లు తనకు దూరమైనట్లు జగన్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ ఓట్లను తన వైపు తిప్పుకునే కార్యాచరణకు ఆయన పదును పెడుతున్నారు
తన కార్యాచరణలో భాగంగా పవన్ కల్యాణ్ ను లక్ష్యం చేసుకుని కాపు సామాజిక వర్గం ఓట్లను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అవంతి శ్రీనివాస్ ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
అవంతి శ్రీనివాస్ ప్రకటన ఆ విషయాన్ని పట్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా చాలా మంది వైసిపిలోకి వస్తారని ఆయన చెప్పారు. కాపు నేతలంతా వైసిపిలో చేరుతారని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అంటే, తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో ఉన్న కాపు నేతలు పవన్ కల్యాణ్ వైపు వెళ్లకుండా తన వైపు మళ్లించుకునే ఎత్తుగడను జగనే వేశారని అనుకోవచ్చు
జగన్ వ్యూహం వల్ల పవన్ కల్యాణ్ కు సహజంగా ఒనగూరే బలాన్ని దెబ్బ తీయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. పవన్ కల్యాణ్ ఏ మేరకు బలహీనపడితే తన పార్టీ అంత బలపడే వ్యూహమే జగన్ అనుసరిస్తున్నారు
గత కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ కమిటీలను వేయడంలోనూ, పార్టీకి వ్యవస్థాగత రూపం ఇవ్వడంలోనూ నిమగ్నమై ఉన్నారు. చంద్రబాబును, నారా లోకేష్ ను ఉతికి ఆరేయడం ఆపేశారు. అదే సమయంలో జగన్ పై కూడా ఆయన మాట్లాడడం లేదు. చంద్రబాబు మాటలను బట్టి పవన్ కల్యాణ్ జనసేనతో తెలుగుదేశం అవగాహనకు వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి.
ఇకపోతే, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎటు వైపు ఉంటారనేది ఇప్పటి వరకు తేలలేదు. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సమయంలో ముద్రగడ చంద్రబాబుకు అనుకూలంగా మారినట్లు కనిపించారు. కానీ, ఆ తర్వాత లేఖాస్త్రాలు సంధిస్తూ చంద్రబాబుపై విరుచుకుపడడం తిరిగి ప్రారంభించారు.
ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ వైపు వెళ్లే ఆలోచనలో లేరని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయనను కూడా తన వైపు తిప్పుకునేందుకు జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీలను, కాపులను తన వైపు తిప్పుకుంటే విజయం ఖాయమనే ఆలోచనతో జగన్ వ్యూహరచన చేసి అమలు చేస్తున్నారు.