వైఎస్ జగన్ ఆపరేషన్ ఆకర్ష్: ఆత్మరక్షణలో చంద్రబాబు
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలో పడేసిన సూచనలు కనిపిస్తున్నాయి. బహుశా, మొదటిసారి వైఎస్ జగన్ తన ప్రత్యర్థి అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎజెండా ఖరారు చేసినట్లు కనిపిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలో పడేసిన సూచనలు కనిపిస్తున్నాయి. బహుశా, మొదటిసారి వైఎస్ జగన్ తన ప్రత్యర్థి అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎజెండా ఖరారు చేసినట్లు కనిపిస్తున్నారు.
నేతలు చేతిలోంచి జారిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అనివార్యతను జగన్ కల్పించినట్లు అర్థమవుతోంది. పలువురు తెలుగుదేశం నాయకులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెసులో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు కూడా ప్రారంభమయ్యాయి.
ఈ పరిస్థితిలో పలువురు తెలుగుదేశం నాయకులు ఆత్మరక్షణలో పడి వివరణలు ఇవ్వాల్సిన పరిస్థితిలో పడ్డారు. ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ లు వైసిపిలో చేరడంతో ఆ రాజకీయ పరిణామంలో వేగం పెరిగింది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసిపిలో చేరుతున్నట్లు ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారంనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు.
పార్టీ మారదలుచుకున్న నాయకులు ఓ వైపు చంద్రబాబుతో భేటీ అవుతూనే మరోవైపు వైసిపి వైపు అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు బుజ్జగింపులతో కూడా వారు ఆగడం లేదు. కొంత మంది మాత్రం తాము తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనల్లో ఎంత మాత్రం నిజం ఉందనేది తెలియదు. తమ ఎత్తుగడలో భాగంగానే అటువంటి ప్రకటనలు చేస్తూ టీడీపి నుంచి జారుకుంటున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తనను పార్టీలోకి ఆహ్వానించి, ఎమ్మెల్యేను చేసిన తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తి లేదని, ఊపిరి ఉన్నంత వరకు టీడీపిలోనే ఉంటానని పాయకరావు పేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు మీడియాలో వార్తలు రావడం ఆశ్చర్యకరంగా ఉందని ఆమె అన్నారు.
వైసిపిలో చేరిన తర్వాత అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తారని ఆయన అన్నారు. కాపు నాయకులంతా వైసిపిలోకి వస్తారనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి తగిన వ్యూహంతో వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది
విశాఖ రూరల్ కు చెందిన ఓ శాసనసభ్యుడు కూడా వైసిపిలో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని వైసిపి నేత ఒకరు ఆయనకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రామచంద్రాపురం శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు కూడా ఖండించారు. ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ లు తనకు మంచి మిత్రులని, అంత మాత్రాన తాను కూడా పార్టీ మారుతానని అనుకోవడం సరి కాదని ఆయన అన్నారు.
మొత్తం మీద, తెలుగుదేశం పార్టీ తుట్టెను వైఎస్ జగన్ కదిలించారు. పైగా, తన పార్టీలోకి రావాలనుకునే వారికి ఆయన గడువు కూడా పెట్టినట్లు చెబుతున్నారు. ఈ నెల 20వ తేదీలోగా వచ్చిన వారికి మాత్రమే తలుపులు తెరిచి ఉంటాయని ఆయన చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.