ప్రతి పేదవాడికి స్వంత ఇల్లు ఉండాలనేది తమ ప్రభుత్వం ద్యేయమని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లకు సంబంధించిన లేఔట్లు, వెబ్ సైట్ ను సీఎం జగన్ ప్రారంభించారు.

అమరావతి: ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఏపీ సీఎం ys jagan తెలిపారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. రాష్ట్రంలో Jagananna Smart Township లకు ప్రభత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు.మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని సీఎం జగన్‌ చెప్పారు. 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం ఉందని సీఎం తెలిపారు.

తొలిదశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరులో ప్లాట్ల కేటాయింపు ఉంటుందని సీఎం వివరించారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటు సిద్ధం కానున్నాయని సీఎం తెలిపారు. తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లు సిద్ధం చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

అన్ని అనుమతులు, వసతులతో డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లను సిద్ధం చేసినట్టుగా సీఎం చెప్పారు. రూ.18 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని సీఎం జగన్‌ తేల్చి చెప్పారు.

https://migapdtcp.ap.gov.in/ websiteలో లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవాలని సీఎం చెప్పారు. అన్ని చోట్లా పట్టణ ప్రణాళికా విభాగం నియమాల మేరకు లేఅవుట్లు సిద్ధం చేశామని సీఎం అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, ధరలో 20 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు.

వెబ్‌సైట్‌ ద్వారా ఇవాళ్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని సీఎం జగన్‌ తెలిపారు. అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ప్లాట్ల ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఉంటాయని సీఎం చెప్పారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులకు స్థలాల కేటాయింపు ఉంటుందని సీఎం జగన్‌ చెప్పారు.

పూర్తి పర్యావరణ హితంగా మొత్తం లే అవుట్‌లో 50 శాతం స్థలాన్ని మౌలిక వసతులు, సామాజిక అవసరాలకు కేటాయించారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్‌ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్, తాగునీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ వ్యవస్థ, వరద నీటి డ్రెయిన్లు, పూర్తి విద్యుదీకరణ, వీధి దీపాలు వంటి వసతులు కల్పిస్తున్నట్టుగా సీఎం తెలిపారు.

పార్కులు, ఆట స్థలాలు, సామాజిక భవనాలు, ఆరోగ్య కేంద్రం, వాణిజ్య సముదాయం, బ్యాంకుతో పాటు ఇతర సామాజిక అవసరాల మేరకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తున్నామని సీఎం వివరించారు. లేఅవుట్‌ నిర్వహణకు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్, పట్టణాభివృద్ధి సంస్థల సంయుక్త నిర్వహణలో అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసే ఏర్పాట్లు చేశామన్నారు.