Asianet News TeluguAsianet News Telugu

ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నా: మీడియాపై దుమ్మెత్తిపోసిన జగన్

తాను ప్రతిపక్షంతోనే కాదు ఉన్నాదులతో కూడా యుద్ధం చేస్తున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తప్పుడు రాతలు రాస్తున్నారంటూ వైఎస్ జగన్ మీడియాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

YS Jagan expresses anaguish at media
Author
Vizianagaram, First Published Feb 24, 2020, 2:57 PM IST

విజయనగరం: విపరీతమైన రాతలు, విపరీతమైన ప్రసారాలు అంటూ మీడియాపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేస్తుంటే దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వీళ్లని ఏమనాలని అంటూ ఆవేశంతో ప్రశ్నించారు. విజయనగరంలో విద్యార్థులకు వసతి దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

తానిప్పుడు యుద్ధం చేస్తున్నది విపక్షాలతో కాదని, ఉన్మాదులు, రాక్షస మూకలతో పోరాడుతున్నామని ఆవేశంగా వ్యాఖ్యానించారు. ఏమీ లేకపోయినా విపరీతమైన రాతలు రాస్తూ, విపరీతమైన అంశాలను ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి చోట మీ బిడ్డకు ఆశీర్వాదాలు కావాలని, దేవుడి వద్ద మీ అందరి ప్రార్థనలు ఉండాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. 

బీసీలకు జనాభా దామాషా పద్ధతిలో స్థానిక సంస్థల్లో సీట్లు పెంచాలని తాము ఆలోచన చేస్తుంటే, అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నవారిని ఏమనాలంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వంతో ప్రజలకు మంచి జరుగుతుంటే ఇక బాబు గురించి మాట్లాడుకునేవారు ఎవరూ ఉండరన్న భయంతో దుష్ప్రచారాలు చేస్తున్న పత్రికలు, చానళ్లను ఏమనాలి అంటూ నిలదీశారు. వసతి దీవెన పథకం గురించి చెబుతూ, ఇంటర్ విద్య తర్వాత రష్యాలో 81 శాతం మంది విద్యార్థులు పైచదువులకు వెళుతున్నారని, మనదేశంలో ఇంటర్ పూర్తయిన తర్వాత పైచదువుల కోసం వెళుతున్న వారు 23 శాతం మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. 77 శాతం మంది పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని, ఈ పరిస్థితి మారాలనే వసతి దీవెన తీసుకువచ్చామని స్పష్టం చేశారు. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు వసతి దీవెన పథకం ద్వారా రెండు విడతలుగా రూ.20 వేలు అందుతాయని, వసతి, భోజనం ఖర్చుల కింద ఈ డబ్బును తల్లులకు అందిస్తామని వెల్లడించారు.

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్న వారు పేదరికం దాటి ముందుకు అడుగు వేయలేదని, ఈ పరిస్థితి మారాలని, అందుకు ఏకైక మార్గం ఆ పేద కుటుంబం అప్పులపాలు కాకుండా, ఆ కుటుంబం నుంచి ఒక ఇంజనీరు, డాక్టర్‌ లేదా కలెక్టర్‌ అయినా కావాలని అన్నారు. వారూ పెద్ద చదువులు చదవాలని, మంచి ఉద్యోగాలు పొందాలని, 
వారు సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపాలని, అప్పుడే పేదరికం పోతుందని జగన్ అన్నారు. 

రాష్ట్రంలో ఇప్పటికీ 33 శాతం నిరక్షరాస్యులున్నారు, అదే సమయంలో దేశంలో అది 27 శాతం మాత్రమే, అంటే జాతీయస్థాయి కంటే దిగువన మనం ఉన్నామని జగన్ చెప్పారు. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) కూడా కేవలం 23 శాతమే ఉందిఈ పరిస్థితి మారడం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని, అందులో భాగంగా ఇవాళ ఇక్కడి నుంచి వసతి దీవెన ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. 

ఏటా రూ.2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న పేద విద్యార్థులకు రూ.20 వేల వరకు హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద ఇస్తామని, జనవరి, ఫిబ్రవరిలో మొదటి వాయిదా కింద రూ.10 వేలు, జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు డిగ్రీ, ఆ పై కోర్సులు అభ్యసించే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన చెప్పారు. 

వీరికే కాకుండా ఐటిఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు కూడా రెండు విడతల్లో రూ.15 వేలు ఇస్తామని, ఒక కుటుంబంలో ఎందరు పిల్లలు చదివినా అందరికీ ఇస్తామని చెప్పారు. దాదాపు 11.87 లక్షల మంది పిల్లలకు ఒక బటన్‌ నొక్కగానే, ఆయా మొత్తాల్లో సగం ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా దాదాపు రూ.1100 కోట్లు జమ అవుతాయని వివరించారు. 

వసతి దీవెన కోసం ఏటా రూ.2300 కోట్లు ఖర్చు చేస్తుండగా, విద్యా దీవెన కోసం ఏటా మరో రూ.3700 ఖర్చు చేయబోతున్నాంమని, ఇవే కాకుండా అమ్మ ఒడి పథకంలో అక్షరాలా 42 లక్షల మంది తల్లులకు, తద్వారా 82 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుందని, ఆ తల్లుల ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున, రూ.6400 కోట్లు జమ చేశామని,ఈ మూడు పథకాలకే రూ.12400 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. 

నాడు–నేడు మనబడి ద్వారా మూడేళ్లలో అన్ని స్కూళ్ల రూపురేఖలు మార్చబోతున్నామని, మధ్యాహ్న భోజన మెనూలో పూర్తి మార్పులుదానికి అదనంగా రూ.200 కోట్లు ఖర్చైనా లెక్క చేయకుండా భరిస్తున్నామని చెప్పారు. నాడు - నేడు మనబడిలో 45 వేల స్కూళ్లు, 471 జూనియర్‌ కళాళాలలు, 3287 హస్టళ్లు, 148 డిగ్రీ కళాశాలల రూపురేఖలు మారుతాయని, దీనికి దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

ప్రతి పిల్లవాడు చదవడమే కాదు, భావి తరంతో పోటీ పడాలని, అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఇవాళ చదువుకుంటున్న పిల్లలు ప్రపంచంలో పోటీ పడాలని, దీన్ని ఈ ప్రభుత్వం గుర్తించి, అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని జగన్ చెప్పారు. కానీ ఈ ప్రభుత్వంపై రోజూ కొందరు విమర్శలు చేస్తున్నారని, వారిని ఏమనాలో మీరే ఆలోచించాలని జగన్ అన్నారు. 

తమను ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి, రాష్ట్రం నుంచి పరిశ్రమలు  వెళ్లిపోవాలని కోరుకుంటూ డబ్బులు ఇచ్చి మరీ పత్రికల్లో రాయిస్తున్నారని విమర్శించారు. 
దుష్ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి వారిని ఏమనాలో మీరే ఆలోచించమని కోరుతున్నానని జగన్ అన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి వీల్లేదంటూ దాడులు చేస్తున్న మూకలను ఏమనాలని ఆయన అడిగారు. 

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 25 లక్షల ఇళ్లస్థలాల పట్టాలు ఇస్తూ ఉంటే, ఇక చంద్రబాబు గురించి మాట్లాడుకునే వారే ఉండరనే భయంతో తప్పుడు రాతలు రాస్తున్న ఈ పత్రికలను, తప్పుడు మాటలు చూపిస్తున్న ఈ ఛానళ్లను ఏమనాలో ఒక్కసారి ఆలోచించాలని మిమ్మల్నందరినీ కోరుతున్నానని ఆయన అన్నారు.

 ఇంగ్లిష్‌ మీడియమ్‌కు, వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఏర్పాటు చేసి వారి జీవితాలు బాగు చేయడం కోసం ఇంకా ఫోకస్డ్‌గా అప్రోచ్‌ తీసుకోవడానికి.. ఇటు వంటి వాటికి కూడా చివరకు.. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషాలో సీట్లు పెంచడానికి కూడా అడ్డు పడుతున్న ఇటువంటి వారిని ఏమనాలో ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నా అని ఆన అన్నారు.

ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నా కూడా చరిత్రలో అతి గొప్ప మెజారిటీతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, ప్రజలు ఇచ్చిన బలంతో, దేవుడి దయతో ఇక మీదట కూడా ముందడుగులు వేస్తామని ఈ వేదిక నుంచి మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ఇంటింటా చదువులు, అందరికీ ఆరోగ్యం, అన్ని ప్రాంతాలకు నీళ్లు, రైతన్నలకు ఆనందం, ఉద్యోగాలు–ఉపాధి.. ఈ లక్ష్యాల సాధనే లక్ష్యంగా ప్రభుత్వాన్ని గొప్పగా నడిపేట్టుగా మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతున్నానని ఆయన అన్నారు. 

దేవుడి దయ చాలా కావాలని, ఎందుకంటే రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని, ఏ తప్పూ చేయకపోయినా కూడా, ఏదేదో జరిగి పోతున్నట్లుగా విపరీతమైన రాతలు. విపరీతంగా చూపిస్తున్న టీవీ ఛానళ్లుయుద్ధం చేస్తోంది ఒక్క ప్రతిపక్షంతోనే కాదని, ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios