వైఎస్ జగన్ ఎఫెక్ట్: ఎట్టకేలకు టీడీపీ నేత వర్ల రామయ్య రాజీనామా
టీడీపీ నేత వర్ల రామయ్య ఎట్టకేలకు తన ఎపిఎస్ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ఓటమి పాలై వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్ గా కొనసాగుతూ వచ్చారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసీ) చైర్మన్ పదవికి ఆయన శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి పంపించారు.
శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలై వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత టీడీపీ హయాంలో నామినేటెడ్ పోస్టుల్లో నియమితులైన పలువురు తమ తమ పదవులకు రాజీనామా చేశారు. వర్ల రామయ్య మాత్రం రాజీనామా చేయకుండా కొనసాగుతూ వచ్చారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి కమిటీ వేశారు. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.