మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్‌మెంట్ ఇస్తున్నాడని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్యలో దస్తగిరి కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. దస్తగిరి స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని తమను నేరంలోకి నెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. 

వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా మారిన ఆయుధాన్ని కొనుగోలు చేసింది కూడా దస్తగిరి అని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. దస్తగిరి‌పై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని అన్నారు. అతడికి బెయిల్ సమయంలో సీబీఐ సహకరించిందని ఆరోపించారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి కోరారు.