సుప్రీంలో ముందస్తు బెయిల్ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది.. సీబీఐకి అవినాష్ రెడ్డి మరో లేఖ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ అధికారులకు లేఖ రాశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఈ లేఖలో ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలిపారు. సుప్రీం కోర్టులో తన పిటిషన్పై రేపు విచారణ ఉందని పేర్కొన్నారు. తన తల్లి శ్రీలక్ష్మి దృష్ట్యా ఈ నెల 27 వరకు విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. 27 తర్వాత విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పారు. సుప్రీం కోర్టులో తన పటిషన్ విచారణలో ఉన్నందున తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఇక, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మరోసారి సుప్రీం తలపుతట్టారు. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేసిన అవినాష్.. అందుకు సంబంధించి వెకేషన్ బెంచ్ విచారించాలని కోరారు. ముందుగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఆయన తరఫు లాయర్లు జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ నరసింహలతో కూడి ద్విసభ్య ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. అయితే పిటిషన్ తమ ముందు విచారణకు రావట్లేదని ధర్మాసనం పేర్కొంది. మరో వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలోనే జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ముందు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఆయన తరఫు లాయర్లు మెన్షన్ చేశారు. అయితే మెన్షనింగ్ రిజిస్ట్రార్ను సంప్రదించాలని జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం సూచించింది.
ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అయితే మే 16, మే 19వ తేదీల్లో రెండు విచారణ తేదీలను అవినాష్ రెడ్డి దాటవేశారు.తాజా ఈరోజు(మే 22) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ప్రస్తుతం తన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున్న విచారణకు హాజరయ్యేందుకు 5 రోజుల సమయం కావాలని కోరారు. ఇక, ఈ నెల 19 నుంచి అవినాష్ రెడ్డి తన తల్లి లక్ష్మమ్మ చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆస్పత్రిలో ఉండిపోయారు.
అయితే ఈరోజు ఉదయం సీబీఐ అధికారులే నేరుగా కర్నూలుకు చేరుకోవడంతో ఏ విధమైన పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్రిక్తత నెలకొంది. కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో చర్చలు జరుపుతున్నారు. శాంతి భద్రతలకు సంబంధించి సీబీఐ అధికారులు ఎస్పీతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అధికారం ఉందని సీబీఐ అధికారులు చెప్పినట్టుగా సమాచారం.