తండ్రిలో మార్పు కోసం.. కొడుకు ప్రాణత్యాగం
తాగుడికి బానిసై.. కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసిన తండ్రిలో మార్పు తేవాలనుకున్నాడు ఓ కన్నకొడుకు. అందుకోసం తన ప్రాణాన్నే త్యాగం చేశాడు
తాగుడికి బానిసై.. కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసిన తండ్రిలో మార్పు తేవాలనుకున్నాడు ఓ కన్నకొడుకు. అందుకోసం తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. ఈ విషాద సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...బొమ్మూరు లెప్రసీ కాలనీకి చెందిన కొల్లూరి వినయ్శంకర్(20) ఓ ప్రైవేటు స్కూలు యజమాని వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. తండ్రి రామ్లక్ష్మణ్ తాగుడుకు బానిసై జులాయిగా తిరుగుతుండడంతో మారమని ఎన్నోసార్లు వేడుకుంటూ వచ్చాడు. తండ్రి కారణంగా ఇంటిపరువు పోతోందని మనస్తాపంతో ఉన్నాడు. తాను చనిపోతే తండ్రి మారతాడని భావించి మంగళవారం మధ్యాహ్నం బొమ్మూరు గోశాల వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అంతకు ముందు వినయ్శంకర్ తన సెల్ ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘నా చావుకు కారణం నాన్న ప్రవర్తనే.. నేను పోయాకైనా ఆయన మారితే చాలు. నేను చనిపోయానని తెలిస్తే.. అమ్మ బతకదని భయంగా ఉంది. నాన్నా.. ఇకనైనా అమ్మను బాగా చూసుకో’ అని వీడియోలో చెప్పాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.