సీఎం జగన్ ఇలాకా.. కడపలో పట్టపగలే నడినడిరోడ్డుపై వైసీపీ కార్యకర్త దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో పట్టపగలే వైసీపీ కార్యకర్తను కత్తులతో పొడిచి చంపిన దుర్ఘటన చోటుచేసుకుంది. బుర్ఖా ధరించిన ఇద్దరు దుండగులు వైసీపీ కార్యకర్త శ్రీనివాసులు రెడ్డిని సమీపించి కత్తులతో పొడిచి పారిపోయారు. స్థానికులు ఆయనను హాస్పిటల్కు తరలించగా.. చికిత్స పొందుతూనే పరిస్థితులు విషమించి మరణించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇలాకాలో ఆయన పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. కడప జిల్లాలో పట్టపగలే నడిరోడ్డుపై వైసీపీ కార్యకర్త, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి అనుచరుడు శ్రీనివాసులు రెడ్డిని దారుణం హత్య చేశారు. ఇద్దరు దుండగులు బుర్ఖా ధరించి కత్తులో పొడిచి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ హత్యకు భూతగాదాలు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
శ్రీనివాసులు రెడ్డికి కొంతమందితో భూతగాదాలు ఉన్నాయి. ఈ భూతగాదాలే ఆయన ప్రాణాలు తీశాయనే అనుమానాలు వస్తున్నాయి. ఈ రోజు శ్రీనివాసులు రెడ్డి జిమ్ నుంచి ఇంటికి వెళ్లుతుండగా మాటు వేసి ఆ దుండుగులు వేటు వేశారు. ఇంటికి నడిచి వెళ్లుతుండగానే ఇద్దరు వ్యక్తులు బుర్ఖా ధరించి ఆయనకు సమీపించారు. అతనిపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. అనంతరం స్పాట్ నుంచి పారిపోయారు.
Also Read: నెల్లూరు సిటీ వైసీపీలో విభేదాలు.. ఎమ్మెల్యే అనిల్ ఆత్మీయ సమ్మేళనంపై ఉత్కంఠ..!!
తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు రెడ్డిని స్థానికులు ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి శ్రీనివాసులు రెడ్డి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి హాస్పిటల్కు చేరుకున్నారు. హత్య ఎలా జరిగింది? అందుకు గల కారణాలను పోలీసులను అడిగి ఆయన తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.