వైసీపీ సీనియర్ నేత, బొత్స గురువు సాంబశివరాజు కన్నుమూత
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు సోమవారం కన్నుమూశారు. అనారోగ్యంతో విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బొత్సకు ఆయన రాజకీయ గురువు.
విజయనగరం: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన సాంబశివరాజు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్ను మూశారు. ఆయనను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తన గురువుగా భావిస్తారు.
సాంబశివరాజు రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఎనిమిది సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1989-94 మధ్య ఆయన మంత్రిగా పనిచేశారు. 1958లో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
గజపతినగరం, సితవాడ శాసనసభా స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలచారు. అయితే, 1994లో పరాజయం పాలయ్యారు. సుదీర్ఘ కాలం ఆయన కాంగ్రెసు పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు.