విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ . రాజ్యసభలో గురువారం కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు పోరాటం చేసి స్టీల్‌ప్లాంట్‌ సాధించుకున్నారని గుర్తుచేశారు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ . రాజ్యసభలో గురువారం కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు పోరాటం చేసి స్టీల్‌ప్లాంట్‌ సాధించుకున్నారని గుర్తుచేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

స్టీల్‌ప్లాంట్‌ను మూడు దశల్లో పునరుద్ధరించాలని ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారని బోస్ అన్నారు. బకాయిలపై వడ్డీ రుణమాఫీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

రుణాలను ఈక్విటీగా మార్చాలని.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్‌ మైన్‌లను కేటాయించాలని సుభాష్ చంద్రబోస్ కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని.. జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు.

విశాఖ రైల్వే జోన్‌పై ఎలాంటి ప్రస్తావన లేదని, విశాఖ మెట్రోకు నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి కిసాన్ రైళ్లను ఎక్కువగా నడపాలని.. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలని బోస్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని.. సంకుచిత బుద్ధితో టీడీపీ నేతలు ఆలయాలను కూల్చారని ఆయన ఆరోపించారు. ఆలయాల ధ్వంసంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ వెల్లడించారు.

చంద్రబాబు హయాంలో ప్రవీణ్ చక్రవర్తి మతమార్పిడిలకు పాల్పడ్డారని.. తమ పాలనలో ఆలయాలపై దాడులు చాలా తగ్గాయని బోస్ వెల్లడించారు.