నాలుగేళ్లు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నావు..? వైసీపీ నేత
‘చంద్రబాబూ నీకు ఇంత పైశాచిక ఆనందం ఎందుకు’ అని సూటిగా ప్రశ్నించారు.
కేవలం ప్రతిపక్ష నేత జగన్ ని టార్గెట్ చేయడానికే చంద్రబాబు ధర్మపోరాట సభలు ఏర్పాటు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. పక్కనున్న ఆరు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు పెట్టి బలవంతంగా జనాన్ని కడపకు తరలించారని ఆరోపించారు.
ప్రతిపక్ష నేత సొంత జిల్లాలో ఇష్టమొచ్చినట్లు జగన్పై మాట్లాడించారని మండిపడ్డారు. ‘చంద్రబాబూ నీకు ఇంత పైశాచిక ఆనందం ఎందుకు’ అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి తెలిసిందల్లా అధర్మం, అన్యాయం మాత్రమేనని దుయ్యబట్టారు.
కేవలం జగన్ని టార్గెట్ చేసుకునే సభ జరిగిందని, జగన్పై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా, అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. కడప జిల్లాలో కరవుతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒక్క మాట మాట్లాడలేదని తప్పుబట్టారు. చంద్రబాబు కేంద్రం ఏం చెబితే అదే నిజం అని చంకలు గుద్దుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. అప్పుడే ఎందుకు నోరు మెదపలేదన్నారు.
నాలుగేళ్లు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నావని ప్రశ్న లేవనెత్తారు. రాజకీయాలు మాట్లాడటానికే సభ నిర్వహించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తిట్టిన నోటితోనే పొగుడుతావ్.. మోదీని పొగిడిన నోటితోనే తిడుతున్నావ్.. ఎన్నిసార్లు యూటర్న్ తీసుకుంటావని ధ్వజమెత్తారు.
చంద్రబాబు నీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టావో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని రాయలసీమ ప్రజలందరూ బహిష్కరించాలని కోరారు. కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబుకు అవగాహన ఉందా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఎలాగూ వచ్చేసారి సీఎం కాలేరు కాబట్టి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
చంద్రబాబుకు రాయలసీమ పేరెత్తే అర్హత లేదని, కడప ప్రజల్ని రౌడీలు, గూండాలు అని సంబోధించిన సీఎం ఎలా కడప జిల్లాకు వస్తారని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఏమైనా చేయగల సమర్ధుడని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్కు నార్కో అనాలసిస్ పరీక్ష చేస్తే నిజాలు వెల్లడవుతాయని అన్నారు.