అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు,లోకేష్: లక్ష్మీపార్వతి
సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, లోకేష్ లేనని విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ.700 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
పెద్దాపురం: సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, లోకేష్ లేనని విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ.700 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి పనుల్లో రూ.37 వేల కోట్లు దారి మళ్లాయని కాగ్ నివేదిక స్పష్టం చేసిందని ఆరోపించారు.
రాష్ట్రంలో అభివృద్ధి అంతా దివంగత ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగిందని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 45 లక్షల హెక్టార్లలో పంట సంవృద్ధిగా సాగితే, చంద్రబాబు హయాంలో 30 లక్షల హెక్టార్లకు వ్యవసాయం పడిపోయిందని వెల్లడించారు.
మరోవైపు కాపు రిజర్వేషన్ల పై చంద్రబాబు మాటతప్పారని తెలిపారు. కాపు రిజర్వేషన్ల పేరుతో కంటి తుడుపు కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో హత్యా రాజకీయాలు పెరిగాయని ఆరోపించారు.
19 మంది వైసీపీ కార్యకర్తలను హత్య చేయించడం, అక్రమ కేసులు బనాయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి అమరావతికి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో వ్యవసాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
అటు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులలో రూ.12 వేల 350 కోట్ల అవినీతి జరిగిందని లక్ష్మీపార్వతి ఆరోపించారు. అరకు మావోయిస్టుల కాల్పుల ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యమే ఘటనకు కారణమన్నారు. ఆంధ్రలో ఉన్న ఇంటెలిజెన్స్ను హైదరాబాద్లో వాడుకోవడం వల్లే ఇక్కడ మావోయిస్టుల సమాచారం తెలుసుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారని విమర్శించారు.