సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలని గన్నవరం టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలని గన్నవరం టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా గన్నవరం‌లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ మారిన వెంటనే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం మంచిది కాదని అనుకున్నానని చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం తాను పార్టీ మారిన రెండో రోజే తనపై, టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిందని విమర్శించారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కవ్వింపు చర్యలకు పాల్పడిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. రాజకీయాలలో మానవత్వం ముఖ్యమని.. తప్పును తప్పని చెప్పలేనప్పుడు రాజకీయాల్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనని చెప్పారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వల్లే కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ డెవలప్ అయిందని కేసీఆర్, కేటీఆర్‌లే అన్నారని చెప్పారు. 

హైదరాబాదు అన్ని రంగాల్లో డెవలప్‌మెంట్ చెందిందంటే దాంట్లో చంద్రబాబు పాత్ర ఉందని యార్లగడ్డ అన్నారు. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ కట్టినప్పుడు 500 ఎకరాల భూమిని చంద్రబాబు కొంటె ఇలాంటివి ఆరోపణలు చేయవచ్చని.. అయితే  హైదరాబాదులో సెంటు స్థలం లేని వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. అలాంటి చంద్రబాబును  ఇలాంటి పనికిమాలిన కేసుల్లో ఇరికించి రాక్షస ఆనందం పొందటాన్ని వికృత చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు. 

దేశంలో ప్రధాని అయ్యే అవకాశం వచ్చిన వదులుకొని తెలుగు ప్రజలకు సేవ చేద్దామని ఇక్కడ రాజకీయాల్లోనే ఉండిపోయిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం బాధకరం అని పేర్కొన్నారు. భూమి గుండ్రంగా ఉంటుంది అన్న విషయం అందరూ తెలుసుకోవాలని అన్నారు.