దూసుకొస్తున్న యాస్ తుఫాను: ఉత్తరాంధ్రపై ప్రభావం, అమిత్ షా వీడియో భేటీలో జగన్
యాస్ తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. ఈ నెల 26వ తేదీన యాస్ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాలపై కూడా పడే అవకాశం ఉంది.
అమరావతి:యాస్ తుఫాను దూసుకొస్తోంది. ఈ నెల 26వ తేదీన తుఫాను ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీంతో తుఫాను తాకిడి ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యల కోసం పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని తీర ప్రాంత జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
యాస్ తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలపై యాస్ తుఫాను ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తుఫాను తాకిడి ప్రమాదం ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పాల్గొన్నారు.
తుఫాను తాకిడి ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిద్దంగా ఉందని, 950 మంది అధికారులు సిద్దంగా ఉన్నారు. భారత రైల్వే 25 రైళ్లను రద్దు చేసింది. సహాయక చర్యల కోసం 16 ట్రాన్స్ పోర్టు విమానాలు, 26 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి.
నావికా దళం కూడా సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంది. ఇండియన్ కోస్ట్ గార్డు కూడా సమాయత్తమైంది. సోమవారం సాయంత్రం వాయుగండం తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతంలో గంటకు 165 కిలోమీటర్ల నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో తుఫాను 155 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని చెబుతున్నారు.