తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్: 11 అసెంబ్లీ ఇంచార్జీల మార్పు
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ చీఫ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యూహత్మకంగా ముందుకు వెళ్తున్నారు.
![Y.S. Jagan mohan Reddy Decides to change 11 Assembly incharges lns Y.S. Jagan mohan Reddy Decides to change 11 Assembly incharges lns](https://static-ai.asianetnews.com/images/01hh5aghc86qc2kfeab0eehp1m/untitled-design--12--png_363x203xt.jpg)
అమరావతి:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే కసరత్తు మొదలు పెట్టారు. రాష్ట్రంలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలను మార్చారు.
గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి విడుదల రజని, మంగళగిరికి గంజి చిరంజీవి, సంతనూతలపాడుకు నాగార్జున, తాటికొండకు సుచరిత,వేమూరుకు ఆశోక్ బాబు,పత్తిపాడుకు బి.కిషోర్,గాజువాకకు రామచందర్ రావు, రేపల్లేకు గణేష్, కొండెపికి ఆదిమూలపు సురేష్, చిలకలూరిపేటకు రాజేష్ నాయుడు, అద్దంకికి పాణెం హనిమి రెడ్డిని ఇంచార్జీలుగా నియమించారు. ఈ 11 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ లను మార్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చకపోవడంతో భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయింది. తొమ్మిది స్థానాల్లో సిట్టింగ్ లను మార్చారు.ఈ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ ఫలితాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ కూడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో జగన్ పావులు కదుపుతున్నారు. వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ వెళ్తుంది.ఈ తరుణంలో కొందరు సిట్టింగ్ లను మార్చాలని వైఎస్ఆర్సీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. సర్వే నివేదికల ఆధారంగా 11 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలను వైఎస్ఆర్సీపీ మార్చింది.
ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకొంటున్నాడు సీఎం జగన్. ఈ సర్వే నివేదికల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లను కేటాయించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్న ప్రజా ప్రతినిధుల పనితీరుపై కూడ సీఎం జగన్ నివేదిక తెప్పించుకుంటున్నారు.పనితీరు మెరుగుపర్చుకోని ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కేటాయించబోనని జగన్ గతంలోనే స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పనితీరు బాగాలేని ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసి పోటీ చేస్తుందా లేదా అనే విషయం ఇంకా స్పష్టత లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రజల మద్దతు ఉన్న అభ్యర్థులను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు.గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించనున్నారు. మరో వైపు బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయనున్నారు. దీనికి తోడు సామాజిక న్యాయం పాటించేలా టిక్కెట్లు కేటాయింపు ఉండనుందని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి.