విజయనగరం జిల్లాలో కరోనా కలకలం.. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్..
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. వివరాలు.. విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలానికి చెందిన భార్యభర్తలు ఆస్ట్రేలియా నుంచి సింగపూర్ మీదుగా ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం ఎయిర్పోర్టుకు వచ్చారు. విశాఖ ఎయిర్పోర్టులో దంపతులకు అధికారులు కరోనా టెస్ట్ చేయగా మహిళకు పాజిటివ్గా తేలింది. భర్తకు మాత్రం కరోనా నెగిటివ్గా నిర్దారణ అయింది. ప్రస్తుతం వారిని బొండపల్లిలోని హోం ఐసోలేషన్లో ఉంచారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా చెబుతున్నారు.
ఇక, దంపతులు ఇద్దరూ మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే మహిళ శాంపిల్స్ను జీవోమ్ సీక్వెన్సింగ్ కోసం విజయవాడ పంపినట్టుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రమణకుమారి తెలిపారు. విజయవాడ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఏ వేరియంట్ అనేది తెలుస్తుందన్నారు. ప్రస్తుతం భార్యభర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. జిల్లాలో కరోనా కేసు ఉన్న నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.