అనకాపల్లి లాడ్జిలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. మృతదేహంపై కత్తిపోట్లు, అన్నీ వేళ్లూ భర్తపైనే
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె శరీరంపై కత్తిపోట్లను గుర్తించారు పోలీసులు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలు మహాలక్ష్మీ శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు వున్నాయి. ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలు అనుమానాలకు తావిస్తున్నాయి. మహాలక్ష్మీ మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. హత్య కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మహాలక్ష్మీని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీనివాసే హత్య చేసి వుంటాడని యువతీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మహాలక్ష్మీని కొన్ని నెలల క్రితమే శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహమైన కొంతకాలం నుంచే టార్చర్ పెడుతూ వుండటంతో ఆమె శ్రీనివాస్కు దూరంగా వచ్చేసింది. ఈ క్రమంలో మాట్లాడుకుందామిన అచ్యుతాపురం లాడ్జికి పిలిచాడు శ్రీనివాస్. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో కానీ మహాలక్ష్మీ శవమై తేలింది. లాడ్జి గదిలో మద్యం సీసాలు, ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పథకం ప్రకారమే మహాలక్ష్మీని శ్రీనివాస్ హత్య చేసి వుంటాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.