వివాహేతర సంబంధం : ‘నీ భర్తకు చెప్పేస్తా’.. మహిళకు యువకుడి బెదిరింపులు.. మరో ప్రియుడితో కలిసి హత్య ..
ఓ వివాహిత ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ యువకుడు అది అలుసుగా తీసుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో విసిగెత్తి మరో ప్రియుడితో కలిసి ఆ యువకుడిని హత్య చేయించింది.
అనకాపల్లి : సబ్బవరం శివారు గొల్లలపాలెంలో జరిగిన యువకుడి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసం వేధించడంతో పాటు వేధించడంతో పాటు తమ మధ్య గతంలో ఉన్న వివాహేతర సంబంధాన్ని తన భర్తకు చెప్పేస్తానని బెదిరిస్తున్న యువకుడిని… ప్రస్తుతం తనతో సన్నిహితంగా ఉంటున్న మరో వ్యక్తితో కలిసి హత్య చేయించింది ఓ మహిళ. ఇందుకు సంబంధించిన వివరాలను సబ్బవరం పోలీస్ స్టేషన్ లో అనకాపల్లి డి ఎస్ పి సునీల్ మీడియాకు శనివారం వెల్లడించారు. సబ్బవరం ప్రాంతానికి చెందిన సింహాచలం ఆరేళ్ల కిందట నగరంలోని ఎన్ఏడి కొత్త రోడ్డు ప్రాంతంలో ఓ కేబుల్ ఆపరేటర్ వద్ద పనిచేసేవాడు.
ఆ సమయంలో అక్కడ ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్ల తర్వాత అక్కడ పని మానేసి స్వస్థలానికి వచ్చేసిన సింహాచలం… వివాహిత తో ఉన్న సాన్నిహిత్యం తో ఆమె బంగారు ఆభరణాలు తీసుకొచ్చి తాకట్టు పెట్టాడు. కొద్దిరోజుల తర్వాత ఆమె తన బంగారు ఆభరణాలు అడగడంతో అవి తాకట్టులో ఉన్నాయని.. అని డబ్బు ఇస్తే విడిపించి తీసుకొస్తా అని నమ్మించాడు. అలా పలుమార్లు డబ్బులు తీసుకున్నాడు. వాడితో పేకాట, బెట్టింగులు ఆడుతూ సింహాచలం తనకు డబ్బులు అవసరమైనప్పుడల్లా ఆమెను బెదిరించి తీసుకునేవాడు.
డబ్బులు ఇవ్వకుంటే తమ మధ్య ఉన్న సంబంధాన్ని ఆమె భర్తకు చెప్పేస్తానని బెదిరించేవాడు. సింహాచలం తీరుతో విసిగిపోయిన సదరు మహిళ అడ్డు తొలగించుకోవాలని భావించింది. తనతో సన్నిహితంగా ఉంటున్న నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన గుడివాడ గోవిందు జరిగిన విషయం అంతా చెప్పింది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని, వివాహేతర సంబంధం విషయాన్ని తన భర్తకు చెబుతానని బెదిరిస్తున్నాడని, ఎలాగైనా సింహాచలం హతమార్చాలని కోరింది.
కృష్ణా జిల్లాలో విషాదం.. మురికి గుంతలో పడి 11 నెలల చిన్నారి మృతి
రియల్ ఎస్టేట్ వ్యాపారి గా పరిచయం చేసుకుని…
సదరు వివాహితకు ఇచ్చిన మాట ప్రకారం సింహాచలంను హతమార్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రణాళికలో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా సింహాచలం కి పరిచయం చేసుకున్నాడు కొద్ది రోజులు గడిచాక ఈ నెల 19న రాత్రి 8 గంటల సమయంలో నగరం నుంచి గోవింద్ కారులో సబ్బవరం వచ్చాడు. సింహాచలాన్ని పిలిపించుకుని గొల్లపాలెం చివరకు తీసుకువెళ్లి ఇద్దరు మద్యం తాగారు. ప్రణాళికలో భాగంగా తనతో తీసుకువచ్చిన కత్తితో సింహాచలం గొంతుపై గోవిందు కోసేశాడు. వెంటనే భయంతో సింహాచలం పరుగులు తీయగా వెనకనుంచి ఇనుప వస్తువుతో తలపై బలంగా కొట్టాడు.
చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడినుంచి నగరంలోకి గోవింద్ వెళ్లిపోయాడు. మరుసటి రోజు 20న ఉదయం సింహాచలం మృతదేహం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతునికి పేకాట, బెట్టింగ్ ముఠాలతో సంబంధాలు ఉండడంతో ఆ దిశగా ముందుగా కేసు దర్యాప్తు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు.
అల్లిపురం ప్రాంతానికి చెందిన గోవింద్ విజయవాడ నుంచి విశాఖకు వస్తుండగా చిన్నయ్య పాలెం వద్ద శుక్రవారం అరెస్టు చేశారు. ఈ హత్యకు ప్రోత్సహించిన సదరు మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సింహాచలం సదరు మహిళ తో పాటు ఆమె చెల్లెలు, మరికొంత మంది మహిళలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వారి వద్ద కూడా డబ్బులు తీసుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఐదు రోజుల పాటు తీవ్రంగా శ్రమించి నిందితులను పట్టుకున్న సీఐ చంద్రశేఖర్ రావు తో పాటు, ఎస్ ఐ ఎల్ సురేష్ ను డిఎస్పీ అభినందించారు. మరోవైపు హత్యకు పాల్పడిన వ్యక్తిని తమకు చూపించలేదని మృతుని కుటుంబ సభ్యులు కొంత సేపు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. మృతుని భార్య, పిల్లలు, కుటుంబసభ్యులు స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీస్ అధికారులు సర్ది చెప్పడంతో శాంతించారు.