కదిలే రైలు నుంచి కిందకు దిగేందుకు యత్నం.. టెక్కీ మృతి
కదిలే రైలు నుంచి కిందకు దిగడానికి ప్రయత్నించిన ఓ టెక్కీ దుర్మరణం పాలైన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
కదిలే రైలు నుంచి కిందకు దిగడానికి ప్రయత్నించిన ఓ టెక్కీ దుర్మరణం పాలైన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. చెన్నై నుంచి బెంగళూరు వస్తుండగా.. ఈ విషాదం చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన కిరణ్ కుమార్(38) ఇటీవల స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని రామమూర్తి నగర్ లో ఉంటూ.. బెంగళూరులోని విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం.. తన మూడు నెలల కుమారుడిని చూసేందుకు నెల్లూరు వచ్చిన కిరణ్.. అనంతరం చెన్నై మొయిల్ ఎక్స్ ప్రెస్ లో బెంగళూరుకు బయలుదేరారు.
కేఆర్ పురం స్టేషన్ లో స్టాప్ లేకపోవడంతో రైలు ఆగలేదు. అయితే.. త్వరగా ఇంటికి వెళ్లాలనే ఆత్రంతో.. కదులుతున్న రైలులో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్లాట్ ఫాం, ట్రాక్ కి మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో తీవ్రగాయాలై.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.