జగన్ సైడ్ అక్కినేని నాగార్జున: కేటీఆర్ ప్లాన్, వైఎస్ తో అనుబంధం
జగన్ సైడ్ అక్కినేని నాగార్జున: కేటీఆర్ ప్లాన్, వైఎస్ తో అనుబంధం
సినీ ఇండస్ట్రీలో కింగ్ అంటే టక్కున చెప్తారు అక్కినేని నాగార్జున అని. సినీ ఇండస్ట్రీలోనూ, ఇతర వ్యాపార రంగంల్లోనూ తన సత్తా చాటారు. కేవలం సినీ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఆరితేరిన నాగార్జున ఇక రాజకీయ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే మంగళవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ లో అక్కినేని నాగార్జున కలిశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో తనయులు నాగచైతన్య, అక్కినేని అఖిల్ లు సీనీ రంగంలో ఓవెలుగు వెలుగుతున్నారు.
ఇకపోతే నాగార్జున పెద్దకుమారుడు నాగచైతన్య భార్య హీరోయిన్ సమంత కూడా తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవి చేపడుతోంది. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అంతేకాదు తెలంగాణలో పలు సామాజిక సేవాకార్యక్రమాల్లో కూడా సమంత పాల్గొంటూ అందరి ప్రశంసలు అందుకుంటుంది.
ఈ నేపథ్యంలో నాగార్జున తన దృష్టి రాజకీయాలపై మళ్లించనున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి పోటీ చేసి గెలుపొంది తద్వారా పార్లమెంట్ లో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మంచి సంబంధాలు ఉండేవి అక్కినేని ఫ్యామిలీకి. అంతేకాదు అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్లాస్ మేట్ కావడంతో ఇరువురు పలుసార్లు కలుసుకోవడం జరుగుతుంది కూడా.
ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాగార్జున పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ప్రచారం జరుగుతుంది. వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం, జగన్ తో ఉన్న స్నేహంతో నాగార్జున వైసీపీలో చేరాలని నిర్ణయించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చెయ్యాలని నాగార్జున భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలోనే అక్కినేని నాగార్జున వైఎస్ జగన్ తో భేటీ అయ్యారంటూ ప్రచారం జరుగుతుంది.
తాను గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చెయ్యాలని ఆశిస్తున్న విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారని తెలుస్తోంది. అయితే టికెట్ విషయం తర్వాత ఆలోచిద్దాం ముందు పార్టీలో చేరాలంటూ వైఎస్ జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే రాజకీయ ఆరంగేట్రం చెయ్యాలని భావిస్తున్న నాగార్జున అందుకు వైసీపీనే ఎంచుకున్నారట. తెలుగుదేశం పార్టీలో చేరితే తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని భావించిన నాగార్జున వైసీపీ వైపు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ కు మంచి సంబంధాలు ఉండటం నాగార్జునకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
నాగార్జునకు సంబంధించి ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉన్న నేపథ్యంలో వైసీపీలో చేరితేనే మంచిదని పక్కా ప్లాన్ తో ఉన్నారట. చంద్రబాబు నాయుడు అంటేనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఒంటికాలిపై యుద్ధానికి లేస్తున్న పరిణామాల నేపథ్యంలో ఇక టీడీపీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదట.
ఇప్పటికే 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన ఆస్తులపై ప్రభుత్వం చేసిన దాడులు ఇంకా నాగార్జునకు గుర్తుండిపోవడంతో ఆయన వైసీపీలోకి వెళ్తే తన ఆస్తులకు తనకు ఎలాంటి ఇబ్బందలు ఉండవని ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
ఇవన్నీ ఇలా ఉంటే నాగార్జున వైసీపీలో చేరేందుకు మేనల్లుడు హీరో సుమంత్ ఒక కారణమని కూడా ప్రచారం. వైఎస్ జగన్ కు సుమంత్ మంచి స్నేహితుడు. ఇద్దరూ క్లాస్ మేట్స్ కావడంతో తరచూ కలుస్తుంటారు. ఈ మధ్యకాలంలోనే సుమంత్ జగన్ తో చిన్న నాటి జ్ఞాపకాలను సైతం గుర్తు చేశారు కూడా.
ఇకపోతే వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగియడంతో ఇక బస్సుయాత్ర చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రజా సంకల్పయాత్ర ద్వారా వైఎస్ జగన్ కవర్ చేయని నియోజకవర్గాలను బస్సుయాత్ర ద్వారా కవర్ చెయ్యాలని ప్లాన్ వేస్తున్నారు.
అయితే ఆ బస్సుయాత్రలో అక్కినేని నాగార్జున ప్రత్యక్షమవుతారని ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కింగ్ నాగార్జున వైసీపీలో చేరబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్తలు విపరీతంగా ట్రోల్ అవుతున్నా కింగ్ నాగార్జున ఖండించలేదు. దీంతో నాగార్జున వైసీపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలు నిజమేనని ప్రచారం జరుగుతుంది.
తాజాగా వైఎస్ జగన్ ని అక్కినేని నాగార్జున కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ నాగార్జున కూడా వైసీపీలోకి వస్తే జగన్ కు తారాబలం మరింత పెరిగే అవకాశం ఉంది. సినీనటులను కూడా ఉపయోగించి ఎన్నికల ప్రచారం హోరెత్తించే ఛాన్స్ కూడా లేకపోలేదు.