మూడేళ్లపాటు వైసీపీ సర్కార్ బీసీ సామాజిక వర్గానికి ఏం చేసిందనే విషయాన్ని వివరించేందుకు విజయవాడలో ఇవాళ జయహో బీసీ మహాసభను నిర్వహించారు.ఈ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్  పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను  తమ సర్కార్  నెరవేర్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. 

విజయవాడ: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా  బీసీలను మోసం చేసిన చంద్రబాబుకు బుద్దికి చెప్పాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ బీసీలను కోరారు. విజయవాడలో బుధవారంనాడు నిర్వహించిన జయహో బీసీ మహాసభలో ఏపీ సీఎం  వైఎస్ జగన్  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.నాగరికతకు బీసీలు పట్టుకొమ్మలని ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. 

ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ అని ఆయన అన్నారు.బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు, బీసీలంటే వెన్నెముక కులాలని సీఎం జగన్ చెప్పారు.ఈ దేశ సంస్కృతికి  ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందన్నారు సీఎం. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టిందన్నారు.ఉన్నత విద్యను దూరం చేయడం వల్లే బీసీలు వెనుకబడ్డారని సీఎం జగన్  తెలిపారు.బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, పనిముట్లు కాదన్నారు సీఎం. చంద్రబాబు నాయుడు బీసీలకు 114 హామీలిచ్చి  10 శాతం కూడ అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే మీ అంతు చూస్తానని చంద్రబాబు బెదిరించారని జగన్ విమర్శించారు.చంద్రబాబు చేసిన మోసాలు, నయవంచనను వారికి గుర్తు చేయాలని జగన్ బీసీలకు గుర్తు చేశారు. నాయీ బ్రహ్మనుల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబుకు బుద్ది చెప్పాలని సీఎం కోరారు. 

చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతుందని, తన వయస్సు  49 ఏళ్లు అని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి ఇంత కాలం  అవుతున్నా  2024 ఎన్నికల్లో  ఒంటరిగా  పోటీ చేస్తానని  చెప్పలేకపోతున్నాడని జగన్ ఎద్దేవా చేశారు.తన పాదయాత్రలో బీసీల కష్టాలను దగ్గరగా  చూసినట్టుగా  జగన్ గుర్తు చేసుకున్నారు.. 2019 ఫిబ్రవరిలో ఏలూరులో నిర్వహించిన డిక్లరేషన్ ను బీసీలకు అమలు చేసిన విషయాన్ని సీఎం జగన్  గుర్తు చేశారు.

బీసీలు రాజకీయ సాధికారతకు నిదర్శనంగా నిలిచారని సీఎం జగన్  చెప్పారు.రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యమని చంద్రబాబుకు చెప్పాలన్నారు.శాశ్వత బీసీ కమిషన్ ను దేశంలోనే తొలిసారిగా  రాష్ట్రంలోనే  ఏర్పాటు చేసినట్టుగా సీఎం జగన్  గుర్తు చేశారు.తన మనసంతా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, నిరుపేదలే ఉంటారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.తన  వెనక కూడా ఈ నలుగురే ఉన్నారని ఆయన  చెప్పారు.