మెరుగైన వైద్య చికిత్స కోసం సినీ నటుడు తారకరత్నను  బెంగుళూరుకు తరలిస్తున్నామని  బాలకృష్ణ చెప్పారు.  ప్రస్తుతం  తారకరత్న  ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.   


కుప్పం: మెరుగైన వైద్య చికిత్స కోసం సినీ నటుడు తారకరత్నను బెంగుళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సినీ నటుడు బాలకృష్ణ చెప్పారు.శుక్రవారంనాడు పీఈఎస్ ఆసుపత్రి వద్ద బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ చెప్పారు. నానమ్మ, తాత, అభిమానుల ఆశీస్సులతో తారకరత్న కోలుకుంటారని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. తారకరత్న గుండెకు ఎడమ వైపు వాల్వ్ బ్లాక్ అయిందని బాలకృష్ణ చెప్పారు. తారకరత్న బీపీ మెయింటైన్ చేస్తున్నారని బాలకృష్ణ తెలిపారు. బీపీ 120/80 మెయింటైన్ అవుతుందని బాలకృష్ణ వివరించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పారామీటర్లు సక్రమంగానే ఉన్నాయన్నారు బాలకృష్ణ. ఇక్కడ వైద్యులు మంచి చికిత్స అందించారని బాలకృష్ణ చెప్పారు. తారకరత్న కోలుకుంటాడని వైద్యులు భరోసా ఇస్తున్నారని బాలకృష్ణ తెలిపారు. ఇంకా మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారని బాలకృష్ణ చెప్పారు.

also read:విషమంగానే పరిస్థితి.. తారకరత్న ఆరోగ్యంపై బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు, ఆందోళనలో ఫ్యాన్స్

బెంగుళూరుకు తరలించాలని తాము భావిస్తున్నామన్నారు. ఎయిర్ లిఫ్ట్ ద్వారా చేయాలా, అంబులెన్స్ ద్వారా పంపాలా అనే విషయమై ఆలోచిస్తున్నామన్నారు. ఎయిల్ లిఫ్టు అయితే అన్ని పరికరాలు అందుబాటులో ఉండవన్నారు. అంతేకాదు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం కూడ ఉంటుందన్నారు. అంబులెన్స్ లో తరలిస్తే మెడికల్ ట్రీట్ మెంట్ అందుబాటులో ఉంటుందుని బాలకృష్ణ చెప్పారు. తాము అంబులెన్స్ లోనే తారకరత్నను బెంగుళూరుకు తరలించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. 10 నిమిషాలకు ఓ సారి చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఫోన్ చేసి వాకబు చేస్తున్నారని చెప్పారు.