కేశినేని..! మీరు మారాలి: విజయసాయిరెడ్డి, కౌంటరిచ్చిన నాని
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నానిల మధ్య ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరోకరు పరస్పరం ఆరోపణలు చేసుకొన్నారు.
అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నానిల మధ్య ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరోకరు పరస్పరం ఆరోపణలు చేసుకొన్నారు.
ప్రజావేదిక తొలగింపును వివాదాస్పదం చేసి సానుభూతి పొందాలని చంద్రబాబు గారు ఆయన ముఠా వేసిన ఎత్తుగడ ఎదురు తన్నింది. రేకుల షెడ్డుకు 9 కోట్ల ఖర్చెలా అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజధాని వ్యవహారాల్లో ఇంకా ఎంత అవినీతి జరిగిందోనన్న చర్చ మొదలైంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 30, 2019
సీఎంగా ప్రమాణం చేసిన 30 రోజుల్లోనే జగన్ గారు 5 కోట్ల మంది ప్రజల్లో ధైర్యం నింపారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలనపై తన ముద్ర వేసిన ముఖ్యమంత్రి ఇంకే రాష్ట్రంలోనూ కనిపించరు. ‘నేను ఉన్నా’ అని ఆయన ఇచ్చిన భరోసా అన్ని వర్గాల ప్రజానీకంలో ఆత్మ విశ్వాసం నింపింది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 30, 2019
టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారంటే ప్రజా సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి విలువైన సూచనలేమైనా చేస్తారనుకున్నాం. కానీ ఆయన అద్దెకు ఉంటున్న ఇంటికి నోటీసులివ్వడం పైనా, నారావారిపల్లెలోని భవనానికి కాపలా తగ్గించడం పైన సంతాప తీర్మానాలు చేశారు. అంటే మీ సమస్యే ప్రజా సమస్యా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 30, 2019
కేశినాని గారూ ఇకనైనా మారండి. మీ అధినేత బిజెపిని సమర్థిస్తే అందరూ జై కొట్టాలి. యూ-టర్ను తీసుకుని కాంగ్రెస్ గుంపులో చేరితే అది గొప్ప నిర్ణయమనాలి. తెలంగాణ సీఎంతో ఘర్షణ వైఖరి అవలంబిస్తే మేమూ అదే చేయాలా? యుద్ధం ఎప్పుడు చేయాలో, సామరస్యంగా ఎప్పుడు మెలగాలో మా సీఎం గారికి తెలుసు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 30, 2019
ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏపీ సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. అమరావతిని కూల్చేద్దాం, హైద్రాబాద్ను అభివృద్ది చేద్దాం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మారాల్సిందిగా కోరారు. చంద్రబాబు బీజేపీని సమర్ధిస్తే అందరూ జై కొట్టాలి... యూ టర్న్ తీసుకొని కాంగ్రెస్ గుంపులో చేరితే గొప్ప నిర్ణయమని స్వాగతించాలా అని ప్రశ్నించారు. యుద్దం ఎప్పుడు చేయాలో తమ సీఎంకు తెలుసునని ఆయన చెప్పారు.
తాను నివాసం ఉంటున్న ఇంటికి నోటీసులు ఇవ్వడం, నారావారిపల్లె ఇంటికి భద్రతను తగ్గించడంపైనే పార్టీ నేతల సమావేశంలో చర్చించి సంతాప తీర్మాణం చేశారని విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 30 రోజుల్లోనే ఏపీ ప్రజల్లో ధైర్యం కల్పించేందుకు సీఎం జగన్ ప్రయత్నించారని విజయసాయిరెడ్డి చెప్పారు.
ప్రజావేదిక కూల్చివేత విషయంలో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ముఠా చేసిన ప్రయత్నం సఫలం కాలేదని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. రేకుల షెడ్డుకు రూ.9 కోట్లు ఖర్చు చేస్తే రాజధాని భూముల్లో ఎంత అవినీతి జరిగిందనే చర్చ సాగుతోందన్నారు.
అయితే విజయసాయిరెడ్డి తనను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. సీబీఐ, ఈడీ చార్జీషీట్లలో పేర్లున్నవారు మారాలని విజయసాయిరెడ్డికి కౌంటరిచ్చారు. అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లొచ్చిన వారు మారాలన్నారు.