విజయనగరం రాజులు శతాబ్ధాల పాటు ఈ నేలను ఏలారు. రాజులు , రాచరికం అంతరించినా నేటి ప్రజాస్వామ్య కాలంలోనూ రాజులదే ఇక్కడ ఆధిపత్యం. ఈ రోజుల్లోనూ ఇక్కడ రాజులంటే భక్తి అలాగే వుంది. ఎన్నికల సమయంలోనూ ఇది బాగా కనిపిస్తుంది.  విజయనగరంలోని రాజవంశాలు కాలక్రమేణా పలు పార్టీలకు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నాయి. ఇక్కడి రాజకీయాలను పూసపాటి, శత్రుచర్ల, వైరిచర్ల, బొబ్బిలి వంశీయులు శాసిస్తున్నారు. క్షత్రియ, తూర్పు కాపు, ఇతర బీసీ సామాజికవర్గాలు ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. 2008లో ఏర్పడిన విజయనగరం లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు తలా ఒకసారి విజయం సాధించాయి. విజయనగరం పార్లమెంట్ స్థానం పరిధిలో ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ స్థానాలున్నాయి.

విజయనగరం.. రాజులు, రాజవంశాలు ఏలిన గడ్డ. ఎందరో గొప్ప రాజులకు, కాకలు తీరిన నేతలకు , చారిత్రక సంఘటనలకు విజయనగరం కేంద్రం. ఓ వైపు బొబ్బిలి రాజులు.. మరోవైపు కురుపాం రాజులు.. ఇంకోవైపు విజయనగరం రాజులు శతాబ్ధాల పాటు ఈ నేలను ఏలారు. రాజులు , రాచరికం అంతరించినా నేటి ప్రజాస్వామ్య కాలంలోనూ రాజులదే ఇక్కడ ఆధిపత్యం. ఈ రోజుల్లోనూ ఇక్కడ రాజులంటే భక్తి అలాగే వుంది. ఎన్నికల సమయంలోనూ ఇది బాగా కనిపిస్తుంది.

విశ్వవిఖ్యాతిని ఆర్జించిన మహానుభావులకు విజయనగరం నిలయం. ఇక్కడి నుంచి ఎందరో నాయకులు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. మరెందరో కవులు, కళాకారులు, విద్యావేత్తలు రాష్ట్రానికి, దేశానికి విశేష సేవలందించారు. విజయనగరంలోని రాజవంశాలు కాలక్రమేణా పలు పార్టీలకు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నాయి. ఇక్కడి రాజకీయాలను పూసపాటి, శత్రుచర్ల, వైరిచర్ల, బొబ్బిలి వంశీయులు శాసిస్తున్నారు. క్షత్రియ, తూర్పు కాపు, ఇతర బీసీ సామాజికవర్గాలు ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. 

విజయనగరం ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. ఇప్పటికీ రాజవంశాల కనుసన్నల్లోనే  :

2008లో ఏర్పడిన విజయనగరం లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు తలా ఒకసారి విజయం సాధించాయి. ఈ సెగ్మెంట్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 15,03,980 మంది. పురుష ఓటర్లు 7,49,841 మంది.. మహిళా ఓటర్లు 7,54,016 మంది. విజయనగరం పార్లమెంట్ స్థానం పరిధిలో ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ స్థానాలున్నాయి. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం లోక్‌సభ పరిధిలోని మొత్తం ఏడు శాసనసభ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బెల్లన చంద్రశేఖర్ 5,78,418 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి అశోక్ గజపతిరాజుకు 5,30,382 ఓట్లు, జనసేన అభ్యర్ధి ముక్కా శ్రీనివాసరావుకు 34,192 ఓట్లు పోలయ్యాయి. 

విజయనగరం ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నిలిచేదెవరు :

వైసీపీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పార్టీ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయనకు వ్యతిరేక వర్గం లేకపోవడం హైలైట్. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బెల్లాన విజయనగరం నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఎచ్చెర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చంద్రశేఖర్ భావిస్తున్నారు. దీనికి తోడు ఒకసారి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన వారు వరుసగా రెండోసారి గెలిచిన చరిత్ర లేదు. బొత్స ఝాన్సీ, అశోక్ గజపతిరాజుల విషయంలో ఈ సెంటిమెంట్ రిపీట్ అయ్యింది. 

విజయనగరం ఎంపీ అభ్యర్ధిగా జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణకు స్వయాన మేనల్లుడు శ్రీనివాసరావు. ఇప్పటికే బొత్స‌కు ఎప్పటిలాగే చీపురుపల్లి అసెంబ్లీ, ఆయన సతీమణి ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ ఖరారు చేశారు జగన్.  అలాంటిది ఆయన కుటుంబంలో మరొకరికి అవకాశం దక్కుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

టీడీపీ విషయానికి వస్తే.. అశోక్ గజపతి రాజు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా వున్నారు. అశోక్ కుమార్తె అదితి విజయలక్ష్మీ గజపతిరాజుకు విజయనగరం అసెంబ్లీ టికెట్ ఇచ్చింది పార్టీ. అశోక్ వైఖరిని గమనిస్తే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుండే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున పేరును అధిష్టానం పరిశీలిస్తోంది.