విశాఖ దుర్ఘటన...డబ్బులిస్తే కన్న తల్లినైనా చంపేసే రకం ఆ పేటీఎం బ్యాచ్: నారా లోకేశ్
విశాఖపట్నంలో గురువారం చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనపై వైసిపి పేటీఎం బ్యాచ్ దుష్ప్రచారం చేస్తోందని నారా లోకేశ్ ఆరోపించారు.
అమరావతి: విశాఖలో గురువారం ఎల్జీ పాలిమర్స్ అనే పరిశ్రమలో విషపూరితమైన గ్యాస్ లీకయి అల్లకల్లోలం సృష్టించింది. ఈ పరిశ్రమ చుట్టుపక్కల దాదాపు ఐదు కిలోమీటర్ల మేర నివాసముంటున్న ప్రజలు ఈ విషవాయువులు పీల్చడంవల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 12మంది మృత్యువాతపడగా వందల్లో బాధితులు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి విషాదకర పరిస్థితుల్లో అధికార వైసిపికి చెందిన పేటిఎం బ్యాచ్ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు నారా లోకేష్ ఆరోపించారు.
''గ్యాస్ లీకై విశాఖ వాసులు విషాదంలో వుంటే వైకాపా విషప్రచారానికి తెరలేపింది. పేటీఎం పుత్రులు కనీస మానవతాదృక్పథం లేకుండా ప్రాంతీయ విద్వేషాలు రేపేలా ఫేక్ ట్వీట్లు వేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు'' అంటూ వైసిపి శ్రేణులపై మాజీ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
''డబ్బులిస్తామంటే కన్నతల్లిని కూడా చంపేసే టైపు పేటీఎం బ్యాచులే ఇటువంటి విద్వేషాలు పెంచే విషప్రచారానికి దిగుతాయి. విశాఖవాసులు ఎవరూ ఆందోళన చెందొద్దు. కేంద్రం, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. నిపుణుల సూచనలు పాటించండి'' అని సూచించారు.
''పుకార్లు నమ్మొద్దు. 5 రూపాయల కోసం రాష్ట్రాన్ని, ప్రజల్ని తాకట్టు పెట్టేందుకైనా వెనుకాడని పేటీఎం బ్యాచుల ఫేక్ ప్రచారానికి విజ్ఞతతో బదులిద్దాం'' అంటూ వరుస ట్వీట్లతో వైసిపి పై మండిపడ్డారు.