Asianet News TeluguAsianet News Telugu

విశాఖ దుర్ఘటనపై సర్కార్ చర్యలు... ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు

విశాఖలో 12మంది ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా వందలాది మందిని అనారోగ్యంపాలు చేసిన ఎల్జీ పాలిమర్ పరిశ్రమపై జగన్ ప్రభుత్వం సీరియస్ చర్యలకు ఉపక్రమించింది.  

Visakhapatnam gas leak incident... YCP Govt Appointed Enquiry Committee
Author
Visakhapatnam, First Published May 8, 2020, 12:35 PM IST

అమరావతి: విశాఖలో గురువారం కలకలం సృష్టించిన విషపూరిత గ్యాస్ లీకేజీ దుర్ఘటనను జగన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటన జరిగిన వెంటనే విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి బాధితులకు అండగా వుంటానన్న హామీ ఇచ్చారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టేందుకు ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని సభ్యుల పేర్లను వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ చైర్మన్ గా మొత్తం ఐదుగురు సభ్యులతో ఈ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా కరికాల వలవన్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ సీపీ ఆర్కే మీనా, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ లను ఎంపికచేసింది. 

ఈ గ్యాస్ లీక్ ఘటనలో కంపెనీ నిర్లక్ష్యంపై ప్రధానంగా విచారణ చేయనుంది ఈ కమిటీ. భవిష్యత్తులో ఎల్జీ పొలిమర్స్ వల్ల ఏవైనా ఇబ్బందులు వస్తాయా అన్నదానిపై కూడా విచారణ చేయనుంది. కంపెనీ నిర్లక్ష్యం ఉందని తేలితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఈ ఉన్నత స్థాయి కమిటీయే ప్రభుత్వానికి సూచించనుంది. 

త్వరితగతిన విచారణను పూర్తిచేసి నివేదికను సమర్పించాల్సిందిగా ప్రభుత్వం కమిటీకి సూచించింది. ఈ దుర్ఘటనకు సంబంధించి నెలరోజుల్లోగా ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. 

విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు భయకంపితులను చేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 12 మంది మృత్యువాతపడగా వందల మంది తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థిలి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వున్నట్లు సమాచారం. 


 

Follow Us:
Download App:
  • android
  • ios