జగన్ సొంత జిల్లాలో దారుణం... టిడిపి మద్దతుదాలపై వాలంటీర్, వైసిపి శ్రేణులు వేట కొడవళ్ళతో దాడి (వీడియో)
గ్రామ వాలంటీర్, మరికొందరు వైసిపి నాయకులు ఓ మహిళతో పాటు మరో వ్యక్తిపై కత్తులతో దాడికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
కడప: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతజిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ రెచ్చిపోయాడు. అతడితో పాటు మరికొందరు వైసిపి నాయకులు ఓ మహిళతో పాటు మరో వ్యక్తిపై కత్తులతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కడప జిల్లా రాయచోటి నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... రాయచోటి మండలం గొర్లముదివేడు గ్రామ పరిధిలోని వల్లూరువాండ్లపల్లిలో టిడిపి మద్దతుదారులు మహదేవపల్లి నరసింహారెడ్డి, నిర్మలమ్మ తో గ్రామ వాలంటీర్ చిన్నప్పరెడ్డి గొడవపడ్డాడు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో చిన్నప్పరెడ్డితో పాటు మరో 8మంది వైసిపి కార్యకర్తలు వేట కొడవళ్ళు, కత్తులు, రాడ్లతో నరసింహారెడ్డి, నిర్మలమ్మపై దాడి చేశారు. ఈ దాడిలో వీరిద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వీడియో
వైసిపి శ్రేణుల దాడిలో గాయపడిన నర్సింహారెడ్డి, నిర్మలమ్మ రాయచోటిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని మాజీ పిసిసి సభ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. అధికార మందంతో వాలంట్రీలు, వైసిపి కార్యకర్తలు రెచ్చిపోతున్నారని మండిపల్లి మండిపడ్డారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదుచేసి వెంటనే అరెస్ట్ చేయాలని మండిపల్లి డిమాండ్ చేశారు.
పంచాయితీ ఎన్నికలల్లో టిడిపికి ఓటు వేశామని కక్ష పెంచుకుని ఇప్పుడు తమపై దాడి చేశారని భాదితులు ఆరోపించారు. తమపై దాడిచేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు.