విజయవాడ ఎంపీ కేశినేని నాని  మరోసారి సంచలన వ్యాఖ్యలు  చేశారు.  టీడీపీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదవాడిని నెత్తిన పెట్టుకొని ఎంపీని చేస్తానన్నారు. కానీ  మోసగాళ్లు, అవినీతిపరులకు  తాను మద్దతివ్వబోనని  ఆయన ప్రకటించారు.  

విజయవాడ:తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. పార్టీని అమ్ముకునే వారికంటే నమ్ముకున్న వారికి పార్టీ బాధ్యతలను అప్పగించాలని ఆయన కోరారు.ఆదివారం నాడు విజయవాడ ఎంపీ కేశినేని నాని విజయవాడలో మీడియాతో మాట్లాడారు.తమ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అదే సమయంలో పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నాని అభిప్రాయపడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నీతి, నిజాయితీతో రాజకీయాలు చేయాలని తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా నాని చెప్పారు. అంతేకానీ అవినీతిపరులకు తాను మద్దతివ్వనన్నారు. తన వెనుక అవినీతిపరులుండరన్నారు. చీటర్లు, రియల్ ఏస్టేట్ మోసగాళ్లు,కాల్ మనీ గాళ్లకు టికెట్ ఇస్తే తాను మద్దతివ్వనని కేశినేని స్పష్టం చేశారు. ఒక పేద వాడిని నెత్తిన పెట్టుకొని ఎంపీ ని చేయమంటే చేస్తానన్నారు..

ప్రజాస్వామ్యంలో అందరూ ఉంటారు. అందులో నీతి పరులు, అవినీతి పరుల ఉంటారని నాని చెప్పారు. టికెట్ ఇచ్చే విషయంలో గాంధీ, రఘురాం, ఎవరికైనా మాఫియా డాన్ లాంటివాళ్లకు ఇవ్వవచ్చన్నారు. అయితే ఆరోజున ఉన్న పరిస్థితులను బట్టి టికెట్ కేటాయింపులుంటాయని నాని అభిప్రాయపడ్డారు. కేశినేని చిన్నికి తాను మద్దతును ప్రకటించబోనని తెలిపారు. చిన్నితో పాట ఇంకా కొంతమంది మనుషులున్నారన్నారు. వాళ్లకు తాను ఏ మాత్రం మద్దతివ్వబోనని కేశినేని నాని తేల్చి చెప్పారు. 

2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓటమి పాలైన తర్వాత కేశినేని నాని సమయం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. పార్టీ నాయకత్వానికి చురకలు వేస్తున్నారు. సోదరుడు కేశినేని చిన్ని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. కేశినేని చిన్నికి విజయవాడలోని బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు వంటి నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. కేశినేని చిన్నిపై గత ఏడాదిలో కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఇటీవలనే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ హోంమంత్రి వసంతనాగేశ్వరరావు కేశినేని నానితో భేటీ అయ్యారు. తమ గ్రామానికి నిధుల మంజూరు విషయమై చర్చించేందుకుగాను నాని వద్దకు వచ్చినట్టుగా వసంత నాగేశ్వరరావు ప్రకటించారు.కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు సహా ఇతర నేతలను లక్ష్యంగా చేసుకొని నాని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.