మాటలు కాదు, ఇక యాక్షన్లోకి : వచ్చే ఎన్నికల్లో నా మద్ధతు బొమ్మసానికే.. దేవినేని ఉమకు షాకిచ్చిన కేశినేని నాని
ఇప్పటి వరకు మీడియా ముఖంగానే తెలుగుదేశం నేతలపై వ్యాఖ్యలు చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈసారి యాక్షన్లోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో దేవినేని ఉమకు టికెట్ ఇస్తే సహకరించనని నాని స్పష్టం చేశారు.
టీడీపీ సీనియర్ నేత, దేవినేని ఉమాకు విజయవాడ ఎంపీ కేశినేని నాని ఝలక్ ఇచ్చారు. దేవినేని ఉమకు టికెట్ ఇస్తే సహకరించనని పరోక్షంగా చెప్పేశారు కేశినేని నాని. దేవినేని వ్యతిరేక వర్గం బొమ్మసానికే తన మద్ధతు వుంటుందని.. ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు రాజభోగాలు అనుభవిస్తున్నారని కేశినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. బొమ్మసాని కుటుంబం 70 ఏళ్ల నుంచి ప్రజా సేవలో వుందని.. బొమ్మసాని లాంటి వ్యక్తి చట్టసభలకు వెళ్లాలని కేశినేని నాని అన్నారు.
ఇదిలావుండగా.. నిన్న కూడా కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను టికెట్ కోసం పాకులాడే వ్యక్తిని కాదని తేల్చిచెప్పారు. తనకు చంద్రబాబునాయుడు టికెట్ ఇవ్వకపోయినా కూడా ఏమీ కాదన్నారు. తనను పోటీ చేయాలని ప్రజలు కోరితే పోటీ చేస్తానని.. పోటీ చేయవద్దని ప్రజలు కోరుకుంటే తాను పోటీకి దూరంగా ఉంటానని కేశినేని నాని స్పష్టం చేశారు. తనకు పార్టీలతో పని లేదని .. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా గెలిపిస్తారేమోనని ఆయన తెలిపారు. ఎన్నికల కోసం పెట్టి తీసేసే ట్రస్టులు తనవి కావన్నారు.విజయవాడలో అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపించినట్టుగా కేశినేని చెప్పారు.
ALso REad: బాబు టికెట్ ఇవ్వకపోతే ఏమీ కాదు, పార్టీలతో పనిలేదు: విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలనం
విజయవాడ ఎంపీగా తాను రెండు దఫాలు విజయం సాధించినట్టుగా నాని చెప్పారు. 2014 నుండి ఇప్పటివరకు తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదన్నారు. విజయవాడకు కేంద్ర ప్రభుత్వం నుండి, ట్రస్టుల నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చినట్టుగా నాని గుర్తుచేశారు. తన నియోజకవర్గంలో రూ.4 వేల కోట్లతో 264 గ్రామాలను దత్తత తీసుకొని ప్రజలకు సేవ చేస్తున్నట్టుగా కేశినేని నాని వెల్లడించారు. దానం చేసేవాడు తాను చేసిన దానం గురించి ఎప్పుడూ చెప్పుకోడన్నారు. రతన్ టాటా తాను చేస్తున్న సేవల గురించి ఏనాడైనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పాడా అని నాని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ట్రస్ట్ లు వస్తాయని.. ఎన్నికలు అయిపోగానే ట్రస్టులు కన్పించకుండా పోతాయని ఆయన పేర్కొన్నారు. ట్రస్టుల పేరుతో హడావుడి చేస్తున్న వారికి డబ్బులు ఎలా వచ్చాయో ఆరా తీయాలన్నారు.
బస్ ట్రావెల్స్ లో ఒకప్పుడు తాను కింగ్ నని చెప్పారు. ఈస్ట్ కోస్ట్ , వెస్ట్ కోస్ట్, సెంట్రల్ ని ఏలినట్టుగా కేశినేని నాని చెప్పారు. ఒక అవినీతి అధికారి అన్న మాటతో తాను బస్ ట్రావెల్స్ వ్యాపారాన్ని వదిలేసినట్టుగా కేశినేని నాని గుర్తు చేశారు. ఆ అవినీతి అధికారి హయంలో జరిగిన వాహనాల రిజిస్ట్రేషన్ ను అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లి రద్దు చేయించినట్టుగా నాని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ స్టాండ్ తీసుకుందన్నారు. దీంతో నిండు సభలో మోడీని వ్యతిరేకించినట్టుగా కేశినేని నాని గుర్తు చేశారు. అయినా కూడా విజయవాడలో అభివృద్ది కార్యక్రమాలు ఎక్కడైనా నిలిచిపోయాయా అని ఆయన ప్రశ్నించారు. ఎంత దెబ్బతీస్తే తన వ్యక్తిత్వం అంతగా రాటు దేలుతుందన్నారు. తనను ఎంత తగ్గించాలని చూస్తే తాను అంత ఎత్తుకు ఎదుగుతానని కేశినేని నాని చెప్పారు.