టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకుంటే చంద్రబాబు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని విజయసాయి రెడ్డి అన్నారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవడంపై చంద్రబాబు అభ్యంతరం తెలపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబును దుయ్యబట్టారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

"వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దట. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు. నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ? ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడుతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు సీఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు" అని ఆయన కామెంట్ చేశారు.

"బాబు కళ్లలో ఆనందం కోసం పచ్చ మీడియా ఏదైనా రాస్తుంది. ఎంగిలి కూడు తిన్న విశ్వాసం కదా! యజమాని, బానిసలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరో ఏడాదిలో ఇక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను అన్ని రాష్ట్రాలూ అనుసరిస్తాయి. సిఎం జగన్ గారి పాలనలో ఏపీ రోల్ మోడల్ అవుతుంది" అని విజయసాయి రెడ్డి అన్నారు.

"సిఎం జగన్ గారు నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారు. నువ్వు అధికారంలో ఉంటే 15% ఎక్సెస్ లు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవాడివి. పరిపాలన అంటే లూటీ చేయడమే అన్న ఫిలాసఫీ కదా నీది. ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయింది" అని ఆయన చెప్పారు.

"కుప్పం వెళ్లి అన్న క్యాంటీన్లు రద్దు చేశారని వాపోయాడు. పేద వాళ్లకు తిండి దొరకకుండా చేశారట. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల్లో రూ.5 భోజనం కోసం ఎదురుచూసే వాళ్లుండటమేమిటి? కుప్పంలో పేదరికమే లేదని గంటాపథంగా చెప్పాల్సిన వాడివి. ఇంత దీనపు పలుకులు ఏమిటి?" అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.