‘అప్పుడు కోతలు కోశారు... ఇప్పుడు నోరు రావడం లేదే..?’
వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి... ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు.
వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి... ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. జగన్ మంత్రి వర్గంపై చంద్రబాబు కనీసం స్పందించలేదని విజయసాయి ఆరోపించారు.
‘‘ఎన్నికల సమయంలో బీసీలు, కాపులను ఉద్ధరిస్తానని కోతలు కోసిన చంద్రబాబుకు జగన్ గారి కేబినెట్ కూర్పుపై ప్రశంసించడానికి ఒక్క మాట రావడం లేదు. సామాజికంగా అణిచివేతకు గురైన వారికి నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులివ్వడంపై ఏ వ్యాఖ్యా చేయకుండా మౌనీ బాబా అయ్యారు బాబు.’’ అని విమర్శించారు.
‘‘తమ వేతనాన్ని 3 వేల నుంచి 6 వేలకు పెంచాలని ధర్నా చేసిన 'ఆశా' అక్కా చెల్లెళ్లపై మహిళా దినోత్సవం రోజునే పోలీసులను ఉసిగొల్పి అరెస్టు చేయించాడు చంద్రబాబు. సీఎం జగన్ గారు ముందస్తు హామీ ఇవ్వకున్నా వారి వేతనాలను 300% పెంచుతూ కొత్త ఆశలు నింపారు. పాలకుడికి, మ్యానిపులేటర్కి తేడా ఇదే బాబూ.’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.
‘‘జగన్ గారి కేబినెట్లో 60% మంత్రులు అణగారిన వర్గాలకు చెందిన వారే. దేశంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా బలహీనవర్గాల ప్రభుత్వమే. బీసీలకు 50% నామినేషన్ పనులు కేటాయించి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని జగన్ గారు హామీ ఇచ్చారు’’ అంటూ జగన్ పై ప్రశంసలు కురిపించారు.