జనసేన అధినేత పవన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మంత్రి జోగి రమేష్ ఫైర్
Vijayanagar: ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మంగళవారం విజయనగరం గుంకలాం హౌసింగ్ లేఅవుట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిరాధారమైన ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
AP Minister Jogi Ramesh: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిరాధారమైన ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. హౌసింగ్ స్కీమ్పై పవన్ కళ్యాణ్తో బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, ప్రాజెక్టులో అవినీతి జరగలేదని నిరూపిస్తామన్నారు. మంగళవారం ఆయన గుంకలాం హౌసింగ్ లేఅవుట్ను సందర్శించి పనులను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 21.30 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నాయకులు క్షేత్ర స్థాయిలో సంక్షేమం, ప్రగతి, అభివృద్ధిని సందర్శించిన తర్వాత సంబంధిత అంశాలపై మాట్లాడాలని సూచించారు.
"ఇక్కడ దాదాపు 10,600 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. ఇక్కడ జరుగుతున్న పనులు, అభివృద్ధిని పవన్ కళ్యాణ్ ఎందుకు చూడలేకపోతున్నారు? ఇక్కడ అక్రమాలు జరిగాయని ఒక్క లబ్ధిదారుడైనా ఆవేదన వ్యక్తం చేశారా?.." అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. భవిష్యత్తులో గుంకలాం లేఅవుట్ అన్ని సౌకర్యాలతో టౌన్షిప్గా మారుతుందని మంత్రి తెలిపారు. జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను, డిప్యూటీ స్పీకర్ కె వీరభద్ర స్వామి, కలెక్టర్ ఎ.సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు రోజు మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. అతి త్వరలోనే విశాఖకు పరిపాలనా రాజధాని ఏర్పాటు కానుందన్నారు. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. ఈ తీర్పుపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. తాము చెబుతున్నది అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు.అభివృద్ధి వికేంద్రీకరణ చేయకపోతే భవిష్యత్తు తరాలు ఇబ్బందులు పడతాయన్నారు.అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ,ఉత్తరాంధ్రలో ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.చట్ట ప్రకారమే అభివృద్ది వికేంద్రీకరణ ప్రక్రియ అని మంత్రి తెలిపారు. ఐదు కోట్ల ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందన్నారు.ప్రజల అభీష్టానికి అనుగుణంగానే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని మంత్రి జోగి రమేష్ చెప్పారు.