గత కొద్దిరోజులుగా సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి షాకిచ్చారు. దీనిలో భాగంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించారు. 

నెల్లూరు జిల్లా వెంకటగిరి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ , ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ షాకిచ్చారు. ఆయన స్థానంలో వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించారు. అయితే జగన్ నిర్ణయం ఆనం ముందే ఊహించినట్లుగా వుంది. నేదురుమల్లి వచ్చినా తగ్గేదే లేదన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. మరో ఏడాదిన్నర వరకు వెంకటగిరి ఎమ్మెల్యేని తానేనని.. అధికారిక కార్యక్రమాల్లో దూకుడుగా పాల్గొంటున్నారు. బుధవారం ఉదయం పింఛన్లను లబ్ధిదారులకు అందించారు. నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వ్యవహారాన్ని కూడా ఆనం ఎక్కడా ప్రస్తావించలేదు. అంతేకాదు.. రాబోయే రోజుల్లో తన పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ALso REad: పర్చూరుకు ఆమంచి , కరణానికి లైన్ క్లియర్... చీరాల వైసీపీని సెట్ చేసిన జగన్

మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శలు సరికాదని తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు. వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా నియమితులైన ఆయన మాట్లాడుతూ.. ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఆనం, నేదురుమల్లి వర్గాలు లేవని.. ఒకటే జగన్ వర్గం ఉందని చెప్పారు. వెంకటగిరిలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించి ఏకతాటిపైకి తీసుకోస్తానని చెప్పారు. ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోందని అన్నారు. వెంకటగిరిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తానని తెలిపారు. వెంకటగిరితో పాటు తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

వైఎస్సార్‌సీపీలోని అత్యంత సీనియర్‌ నేతల్లో ఒకరైన రామనారాయణరెడ్డి ఇటీవల ప్రభుత్వంపైనా, పాలనపైనా విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై సీఎం జగన్ వేటు వేశారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని పార్టీ తొలగించారు. ఆ స్థానంలో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. ఆనం రామనారాయణ రెడ్డిపై విమర్శలు చేస్తే పార్టీ ప్రయోజనాల కు భంగం వాటిల్లుతుంద ని, అందుకే కొత్త నేతను నియోజకవర్గ ఇంచార్జిగా నియమిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.