అందుకే ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురయ్యారు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
సమాజంలోని పేద, బలహీనవర్గాలకు చేయూతనిచ్చిన వ్యక్తి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎన్టీఆర్ చారిత్రక పురుషుడని కొనియాడారు.
సమాజంలోని పేద, బలహీనవర్గాలకు చేయూతనిచ్చిన వ్యక్తి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎన్టీఆర్ చారిత్రక పురుషుడని కొనియాడారు. శనివారం తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చాడని చెప్పారు. అవి అమలు అవుతున్నాయో లేదో కూడా ఆయన తెలుసుకునేవారని అన్నారు. రాజకీయాల్లో సైలెంట్ విప్లవాన్ని తీసుకొచ్చిన మహావ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
రాజకీయంలో ఎన్టీఆర్కు చాతుర్యం ఉందని తాను చెప్పలేనని అన్నారు. కుట్రలు, కుతంత్రాలను ఎన్టీఆర్ గమనించలేకపోయారని చెప్పారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ బోళా మనిషి అని.. అందుకే ఆయన వెన్నుపోటుకు గురయ్యారని అన్నారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్దాంతాన్ని నమ్మి పని చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
తాను ఉపరాష్ట్రపతి అయ్యాక రాజకీయాలు వదిలేశానని.. అయితే ప్రజలను కలవడం మాత్రం మానుకోలేదని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రకృతిని ప్రేమించాలి.. ప్రకృతితో కలిసి జీవించాలని అన్నారు. సెల్ ఫోన్లు ఎక్కువగా వాడితే హెల్ ఫోన్లు అవుతాయని చెప్పారు.